Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jul 2023 09:15 IST

1. 15 రోజుల్లో తగ్గనున్న టమాటా ధరలు!

దేశ వ్యాప్తంగా మండిపోతున్న టమాటా ధరలు 15 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి పంట మార్కెట్లకు చేరడం, వివిధ ప్రాంతాల నుంచి సరఫరా పెరగడమే దీనికి కారణమన్నారు. మరో నెల రోజుల్లో టమాటా ధరలు సాధారణ స్థాయికి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎంబీబీఎస్‌లో చేరిన పదేళ్లలోపు నెక్స్ట్‌లో ఉత్తీర్ణత

నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌)కి సంబంధించిన నిబంధనలను విడుదల చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం ఈ పరీక్ష స్టెప్‌-1 (థియరీ), స్టెప్‌-2 (ప్రాక్టికల్‌) అన్న రెండు విభాగాలుగా జరుగుతుంది. స్టెప్‌-1లో ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఎంబీబీఎస్‌లోని సబ్జెక్టులను కవర్‌చేస్తూ ఈ పరీక్ష ఆరు పేపర్లతో ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎల్‌నినో... తేలేనా? ముంచేనా?

ఎల్‌నినో అనేది ఒక వాతావరణ పోకడ. మధ్య తూర్పు పసిఫిక్‌ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఎల్‌నినో వేడి దశ కాగా.. లానినా అనే మరో పక్రియ శీతల దశ. ఎల్‌నినో తర్వాత లానినా వస్తుంది. 2-7 ఏళ్ల కాలావధి కలిగిన ఒక కాలచక్రంలా ఈ రెండు పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటాయి. మూడేళ్ల లానినా దశ తర్వాత తిరిగి ఈసారి ఎల్‌నినో దశ వచ్చిందని అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌వోఏఏ) పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మూగబోయిన 320 ఏళ్ల వార్తాపత్రిక!

ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటైన ‘వీనర్‌ జైటుంగ్‌’ గొంతు మూగబోయింది! దాని రోజువారీ ముద్రణను నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మూడు శతాబ్దాలకుపైగా చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ పత్రిక చివరి సంచికను శుక్రవారం ముద్రించారు. ‘వీనర్‌ డయేరియం’ పేరుతో 1703 ఆగస్టు 8న ఈ పత్రిక ప్రారంభమైంది. తర్వాత దాని పేరు ‘వీనర్‌ జైటుంగ్‌’గా మారింది. ఆస్ట్రియా ప్రభుత్వమే దీనికి యాజమాన్యంగా ఉన్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిర్మాణాలిక్కడ.. పనీ ఇక్కడే

నిర్మాణ రంగంలో ఎక్కువమంది వలస కార్మికులే ఉన్నారు. బిహార్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, యూపీ వంటి ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడివాళ్లేమో దుబాయ్‌, ఇతర అరబ్‌ దేశాలకు వెళ్లి అక్కడ నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ సూచన మేరకు స్థానికులకు నైపుణ్యాలు పెంపొందించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రణాళికను క్రెడాయ్‌  తెలంగాణ రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మ సొమ్ముకూ ఎసరు..!

దుర్గగుడికి చెందిన డబ్బులంటే ఎఫ్‌డీలు తప్ప మరేవీ లేవు. ఈ నిధులను అభివృద్ధి పేరుతో కరిగించేస్తే.. ఇంక రోజువారీ భక్తుల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆలయ నిర్వహణ ఆధారపడాల్సిన దయనీయమైన పరిస్థితి వస్తుంది. కొవిడ్‌ వంటి పరిస్థితులు వస్తే.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు. ప్రస్తుతం దుర్గగుడికి సమీపంలోనే కొండదిగువన బ్రాహ్మణవీధి వెంకటేశ్వరస్వామి ఆలయ పరిస్థితి ఇలాగే దిగజారిపోయింది. ఉన్న నిధులన్నీ కరిగించేయడంతో ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు కూడా ఇవ్వడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘రాజకీయాల కోసం జగన్‌ను కలవలేదు’

జిల్లాలో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో వివిధ అంశాలు, సమస్యలు తెలుసుకుంటున్నట్లు క్రికెటర్‌ అంబటి రాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తెనాలి మండలం కొలకలూరులో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తాను క్రీడల నేపథ్యంలో కలిశాను తప్ప రాజకీయాల కోసం కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుముందు శివాలయంలో పూజలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భీమలింగేశ్వరుడికి మద్యం.. మాంసమే నైవేద్యం

సాధారణంగా తీపి పదార్థాలు, ఇతరత్రా వంటకాలను స్వామికి నైవేద్యంగా ఉంచుతాం. గడేకల్లులో మాత్రం భక్తులు మద్యం, మాంసాన్ని నివేదించి పూజిస్తారు. ఇది విడపనకల్లు మండలం గడేకల్లులోని భీమలింగేశ్వర ఆలయం ప్రత్యేకత. భీమలింగేశ్వరస్వామి 900 సంవత్సరాల కిత్రం జీవసమాధి అయినట్లు చరిత్ర చెబుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేములవాడకు చెందిన స్వామి.. ఆధ్యాత్మికత ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా రాయదుర్గంతోపాటు ఉరవకొండ ప్రాంతంలోని చాబాలలో ప్రచారం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏం చేశారని జగన్‌కు ఓటేయాలి..?

‘ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారని మేం ఓటేయాలి? మాకు ఏమీ వద్దు. మేమేమీ తీసుకోం.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసేది లేదు’ అని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎదుట ఓ మహిళ తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు. శుక్రవారం నగరంలోని ఆరో డివిజన్‌ రేచర్లపేట ఎస్సీకాలనీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటా పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సారొస్తున్నారని విద్యార్థులను ఉంచేశారు!

 పాఠశాల వేళల్లో తనిఖీలు జరగాలి. అప్పుడే ఆ తనిఖీలకు సార్థకత చేకూరుతుంది. అలా కాకుండా అధికారి వస్తున్నారంటూ అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్థులను చీకటి పడినా పాఠశాలకు పరిమితం చేశారు. మీడియా రాకతో మైదుకూరులో పాఠశాల ముగింపు సమయం మరో రెండు గంటల తరువాత విద్యార్థులను ఇంటికి పంపగా, అనంతరం గంటకు ఉపాధ్యాయులు నిష్క్రమించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు శుక్రవారం సమాచారం అందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు