Kejriwal: కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలుంచుదాం: ప్రధానికి కేజ్రీవాల్‌ అరుదైన విజ్ఞప్తి

మనం ఎంత శ్రమించినా.. మన ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌. అందుకోసం ప్రధాని మోదీకి ఓ అభ్యర్థన చేశారు. 

Updated : 26 Oct 2022 13:41 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరుదైన విజ్ఞప్తి చేశారు. కొత్త కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రంతో పాటు లక్ష్మి, విఘ్నేశ్వరుడి దేవతా రూపాలను ఉంచాలని కోరారు.

‘కొత్త కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రాన్ని, మరోవైపు దేవతా మూర్తులు లక్ష్మి, గణేశుడి రూపాలను ఉంచొచ్చు. దేవతల చిత్రాలు ఉంచడం వల్ల దేశం అభివృద్ధి మార్గంలో పయనిచేందుకు ఉపయోగపడుతుంది. మనం శ్రమించినా.. దైవం ఆశీస్సులు లేకపోతే మన ప్రయత్నాలు ఫలించవు. అందుకే నోట్లపై వారి రూపాలు చిత్రించాలని ప్రధానిమోదీని అభ్యర్థిస్తున్నాను. ఇండోనేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ.. ఆ దేశ నోట్లపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియానే చేయగలిగినప్పుడు.. మన వల్ల ఎందుకు కాదు..? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు మన ప్రయత్నాలతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా అవసరం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు.

కేజ్రీవాల్‌ కొత్త ముసుగు ధరించారు: భాజపా

‘దేవుళ్ల గురించి ఆప్‌ నేతల మాటతీరు వేరేగా ఉండేది. వారు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికల వేళ ఇప్పుడు కొత్త యత్నాలు చేస్తున్నారు. రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారు, కశ్మీరీ పండిట్ల వలసలు అబద్ధమని వ్యాఖ్యానించినవారు ఇప్పుడు కొత్త ముసుగు ధరించారు. ప్రస్తుతం కేజ్రీవాల్‌ రాజకీయాలు యూ టర్న్ తీసుకుంటున్నాయి’ అని భాజపా నేతలు కేజ్రీవాల్‌ సూచనను తీవ్రంగా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని