PM Modi: హిమాచల్‌లో సైనికులతో కలసి మోదీ దీపావళి వేడుకలు

దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లా సైనికులు దృఢంగా ఉన్నందువల్లే భారత్ సురక్షితంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 

Published : 13 Nov 2023 02:03 IST

లేప్చా: అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోదీ దీపావళి (Diwali) పండుగ వేడుకలు చేసుకున్నారు. అనంతరం సైనిక బలగాలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

‘‘ధైర్యసాహసాలు కలిగిన మీరు హిమాలయాల్లా సరిహద్దుల్లో దృఢంగా ఉన్నంత వరకు భారత్‌ సురక్షితంగా ఉంటుంది. సైనిక బలగాలు ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించాయి. పండుగవేళ కుటుంబానికి దూరంగా.. సరిహద్దుల్లో విధులు నిర్వహించడం.. మీ నిబద్ధతకు నిదర్శనం. భారత భద్రతా బలగాలు పనిచేస్తున్న చోటు నాకు దేవాలయంతో సమానం’’ అని ప్రధాని మోదీ చెప్పారు. 

గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన ప్రధాని పాట

ఈ సందర్భంగా భద్రతా బలగాలు వివిధ దేశాల్లో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సూడాన్‌ నుంచి భారతీయులను తీసుకువచ్చే మిషన్‌ను సైన్యం  విజయవంతంగా పూర్తి చేసింది. తుర్కియేలో భూకంపం సంభవించినప్పుడు భారత బలగాలు ఎంతో ధైర్యసాహసాలతో సహాయకచర్యలు చేపట్టి అక్కడి ప్రజలను కాపాడాయి. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనికులతో ముచ్చటించి.. వారికి స్వీట్లు పంచి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గత ఏడాది కార్గిల్‌లో వేడుకలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని