AamirKhan: 15 ఏళ్ల బంధానికి స్వస్తి

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌ - కిరణ్‌రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి

Updated : 03 Jul 2021 14:37 IST

విడాకులు తీసుకుంటున్న ఆమిర్‌ ఖాన్‌ దంపతులు

ముంబయి: బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు విడిపోతున్నారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు.

‘మా ఈ 15 సంవత్సరాల వైవాహిక బంధం జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులుగా ఉండాలనుకుంటున్నాం. ఎంతోకాలం నుంచి మేము విడిపోవాలని అనుకుంటున్నాం. విడాకులు తీసుకోవడానికి, కొత్త ప్రయాణాన్ని ఆరంభించడానికి ఇదే సరైన సమయంగా మేము భావిస్తున్నాం. మా కుమారుడు ఆజాద్‌కి తల్లిదండ్రులుగా ఉంటూ అతని బరువు, బాధ్యతలు ఉమ్మడిగా చూసుకుంటాం. అలాగే, పానీ ఫౌండేషన్‌, ఇతర వృత్తిపరమైన విషయాల్లో మేమిద్దరం కలిసే పనిచేస్తాం. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మాకు ఎంతగానో సపోర్ట్‌ చేసిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. మా వైవాహిక బంధానికి ముగింపులా మీరు ఈ విడాకులను చూడకండి. ఇది కేవలం కొత్త ప్రయాణానికి నాంది మాత్రమే అనుకోండి’ అని ఆమిర్‌, కిరణ్‌రావు ప్రకటించారు.

మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆమిర్‌ఖాన్‌.. కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమిర్‌ కథానాయకుడిగా నటించిన ‘లగాన్‌’ సినిమాకి కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం 2005 డిసెంబర్‌ 28 వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 2011లో ఆజాద్‌ అనే బాబుకి సరోగసి పద్ధతిలో ఈ దంపతులు జన్మనిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని