Director Dasaradh: ఆ రీమేక్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు నచ్చుతుంది..: దర్శకుడు దశరథ్‌

టాలీవుడ్‌లో రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దశరథ్‌. ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో ఆయన తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Updated : 23 Jan 2023 15:21 IST

హైదరాబాద్‌: తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు డైరెక్టర్‌ దశరథ్‌ (Director dasaradh). సినిమాల్లోకి రాకముందు ఎన్నో సీరియల్స్‌కు మాటలు రాసిన ఆయన 2002లో వచ్చిన సంతోషం సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రచయితగా వెండితెరకు పరిచయమై దర్శకుడిగా మంచి కుటుంబ కథా చిత్రాలు అందిస్తున్నారు. చెప్పాలని ఉంది కార్యక్రమంలో ఆయన చెప్పిన సినీ సంగతులేంటో చూసేద్దాం (Director dasaradh interview).

రచనపై ఆసక్తి ఎప్పుడు కలిగింది?

దశరథ్: మా అమ్మకు ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల నేను మా తాతయ్య వాళ్లింట్లో పెరిగాను. మొదటి నుంచి పుస్తకాలు చదువుతూ ఉండే వాడిని. కానీ రాసే శక్తి నాలో ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్‌ ఆయన శిష్యులతో ఓ పుస్తకం విడుదల చేయాలని.. దానికి ఎవరైనా కథలు పంపవచ్చని అన్నారు. అలా పంపిన వాటిల్లో బాగున్నవి ఆ పుస్తకంలో ప్రచురిస్తామన్నారు. ఆయన్ని కలవాలనే ఉద్దేశంతో ఓ కథ రాసి పంపాను. నెల తర్వాత ఓ ఫోన్‌ వచ్చింది. సుమారు 750కథల్లో నా కథ మాత్రమే ఎంపిక చేశారని దాని సారాంశం. అలా ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఇక ఆయన దగ్గరే రైటర్‌గా చేరాను.

దర్శకుడు తేజ, వైవీఎస్‌ చౌదరిలతో పరిచయం ఎలా ఏర్పడింది?

దశరథ్: యండమూరి వీరేంద్రనాథ్‌తో కలిసి ‘ఆనందోబ్రహ్మ’ సీరియల్‌ చేసేటప్పుడు కన్నడలో హిట్‌ అయిన ఓ సీరియల్‌ను సినిమాగా తీశారు. దాన్ని తెలుగులో ‘హలో ఐ లవ్‌ యూ’ పేరుతో వివేక్‌ శంకర్‌తో కలిసి తీయాలనుకున్నాం. ఆ సమయంలో డైరెక్టర్‌ తేజని కలిశాను. అలా మొదలైన మా ప్రయాణం ‘జయం’ సినిమా వరకు కొనసాగింది. జయం సినిమా తర్వాత నేను దర్శకత్వం వైపు వెళ్లాను.

‘చిత్రం’ సినిమాకు రచయితగా పనిచేశారు కదా?ఆ కథ గురించి చెప్పండి?

దశరథ్: ‘చిత్రం’ సినిమా రూ.40లక్షల్లో తీయాలని అనుకున్నట్లు తేజ చెప్పారు. చాలా తక్కువ మందితో తక్కువ రోజుల్లో తీశాం. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ స్థాయిలో ఓపెనింగ్స్‌ వస్తాయని అనుకోలేదు. దాంతో మాకు మంచి గుర్తింపు వచ్చింది. నా సినీ ప్రయాణంలో ముందడుగు వేయడానికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఆ సినిమా. అక్కడి నుంచి నేను దర్శకుడిని అయ్యే వరకు తేజ దగ్గరే రైటర్‌గా పని చేశా.

సంతోషం సినిమాకు నాగార్జున గారినే తీసుకోవాలని ఎందుకు అనిపించింది?

దశరథ్: గోపాల్‌రెడ్డి ఓసారి నా దగ్గరకు వచ్చి నాగార్జున కోసం కథ వెతుకుతున్నాం. ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగారు. అప్పుడు ఓ కథ రాసి ఆయనకు వినిపించాను. కథ విన్నాక నాగార్జున గారు.. కథ బాగుంది నువ్వే దర్శకత్వం వహించవచ్చు కదా అన్నారు. అలా ఆయన ప్రోత్సాహంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించాను. నా జీవితంలో మర్చిపోలేని విజయాన్ని ఆ సినిమా నాకు అందించింది. ఆ చిత్రబృందానికి థ్యాంక్స్‌ చెప్పాలి.

‘ఫ్యామిలీ సర్కస్‌’ సినిమాకు డైలాగ్స్‌ రాశారు కదా? ఆ జోనర్‌ సినిమాకు రాయాలని ఎందుకు అనిపించింది?

దశరథ్: తేజకు, నాకూ ఇద్దరికీ కామెడీ అంటే ఇష్టం. అందుకే ఆ సినిమాలోని పాత్రలకు డైలాగ్స్‌ రాయడం చాలా సులభం అనిపించింది. ఒకప్పుడు మనకు అన్ని రకాల సినిమాలు ఉండేవి. ఆ తర్వాత కేవలం ఫ్యామిలీ, యాక్షన్‌ సినిమాలే ఎక్కువ వచ్చాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి.

ఓటీటీలో ఏమైనా ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారా?‘నువ్వు-నేను’ సినిమా డైలాగ్‌ల్లో కొన్ని వివాదాస్పదమయ్యాయి కదా?

దశరథ్: హరీశ్‌ శంకర్‌ ఆధ్వర్యంలో ఆహా లో రెండు సిరీస్‌లకు రైటర్‌గా వర్క్‌ చేస్తున్నాను. ఈటీవీలో రెండు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నా. 
‘నువ్వు-నేను’ సినిమాలో లెక్చరర్‌ పాత్రకు అనుగుణంగా డైలాగ్‌లు రాశాం. అంతేకానీ ఎవరినీ కించపరచడానికి కాదు. పాత్ర స్వభావం అలాంటిది కాబట్టి అలా ఫన్నీ డైలాగ్స్‌ రాశాం. ఇక ఈ సినిమా ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది. మేము కచ్చితంగా ఆ సినిమా హిట్‌ అవుతుందని అనుకున్నాం.

హరీశ్‌ శంకర్‌ (harish shankar), పవన్‌కల్యాణ్‌(pawan kalyan) సినిమాకు స్క్రీన్‌ప్లే చేస్తున్నారని తెలిసింది. ఈ అవకాశం ఎలా వచ్చింది?

దశరథ్: అవును. హరీశ్‌ శంకర్‌ తమిళ్‌ ‘తెరి’ మూవీని రీమేక్‌ సినిమా తీస్తున్నారు. దానికి నేను స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేస్తున్నాను. ఆ సినిమా స్ట్రక్చర్‌ తీసుకుని, చాలా మార్పులు చేశాం.  అది కచ్చితంగా పవన్‌కల్యాణ్‌ అభిమానులందరికీ నచ్చేలా హరీశ్‌ దాన్ని డిజైన్‌ చేశారు. అలాగే రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో ఓ సినిమాను రీమేక్‌ చేయమని అడిగిన మాట వాస్తవమే. ఆ జానర్‌ మూవీ నాకు చేయాలని లేదు. అందుకే దానికి కూడా రైటర్‌గా వర్క్‌ చేస్తున్నా.

ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలయ్యే సినిమాల కన్నా ఓటీటీలోవి బాగున్నాయంటున్నారు? దానిని మీరు ఏకీభవిస్తారా?

దశరథ్: మనం తీసిన చిత్రం ఎక్కడ విడుదలైనా పర్వాలేదు. నిర్మాతకు పెట్టిన డబ్బు రావాలి. కష్టపడిన వారికి ప్రోత్సాహం రావాలి. అలాంటప్పుడు సినిమా ఎక్కడ విడుదలైతే ఏమవుతుంది. 

రచయితకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లాంటిది కావాలంటారా? దాని వల్ల మంచి జరుగుతుందంటారా?

దశరథ్: కచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే ఈ తరం రచయితలు అందరూ ఎంతోకొంత ట్రైనింగ్‌ తీసుకోనే సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. అది చాలా హర్షించాల్సిన విషయం. ఒకప్పుడు అనుభవాన్ని బట్టి డబ్బు వచ్చేది. ఇప్పుడు అలా కాదు మొత్తం మారిపోయింది.

ఆర్పీ పట్నాయక్‌కు మీకు మధ్య ఉన్న బంధం ఏంటి?

దశరథ్: తేజ గారు పరిచయం అవ్వడానికి ముందే నాకు ఆర్పీ పట్నాయక్‌, కులశేఖర్‌లు స్నేహితులు. మేం ముగ్గురం తేజ గారికి ఒకేసారి పరిచయమయ్యాము. ఆర్పీతో కలిసి నేను చాలా సినిమాలకు వర్క్‌ చేశాను. చాలా బాగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తారు.  తేజగారు పాటల విషయం దగ్గరుండి చూసుకుంటారు.

తేజగారు మీ ‘సంబరం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారట..

దశరథ్: ‘సంతోషం’ సినిమా హిట్‌ అయ్యాక తేజ గారి బ్యానర్‌లోనే సినిమాలు తీసుకునే అవకాశం కల్పించారు. అలా తీసిన సినిమానే ‘సంబరం’. నేను కుటుంబ కథా చిత్రాలను ఎక్కువ ఇష్టపడతాను. హారర్‌ సినిమాలు ఎందుకో నచ్చవు. వాటికి కనెక్ట్‌ అవ్వలేను.

యువ రచయితలకు అవకాశం ఇస్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. మీరేమంటారు?

దశరథ్: కొత్త కథలు వస్తున్నాయి. గౌతమ్‌ తిన్ననూరి కథలు నాకు చాలా ఇష్టం. అలాగే  శివ నిర్వాణ సినిమాలు కూడా బాగుంటాయి. బయటి కథలు తీసుకొని సినిమాలు తీసే వారి సంఖ్య ఒకప్పుడు చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చాక అంతా మారిపోయింది. మనం ఒక కథ రాసుకుంటే అది వేరే సినిమాల్లో ఎపిసోడ్స్‌కు అయినా పనికి వస్తుంది. అందుకే ఎవరికి వారే కథలు రాసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రభాస్‌తో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా జర్నీ ఎలా సాగింది?

దశరథ్: నేనైతే మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదు(నవ్వుతూ). దిల్‌రాజు గారు కుటుంబ కథా చిత్రం ఒకటి తీద్దాం. పెళ్లి కాన్సెప్ట్‌ మీద ఒక కథ తీద్దాం అన్నారు. అలా ఒక లైన్‌ రాసుకొని దానితో కథ రాసుకున్నాం. ప్రభాస్‌ని ఊహించుకొని ఆ కథ రాశాం. కథ రాసుకునేప్పుడు ఓ హీరోని అనుకుని అతడికి తగ్గట్టు రాసుకుంటాం. డైలాగ్‌లు చివర్లో రాస్తాం.

ఒక సినిమాలో హీరోకు, విలన్‌కు ఉన్న ప్రాధాన్యత హీరోయిన్‌కు ఎందుకు ఉండడం లేదు?

దశరథ్: అన్నింటికీ కథలే మూలం. దాని ఆధారంగానే సినిమాల్లోని పాత్రలు ఉంటాయి. ఒకప్పుడు హీరోలను ఎలా చూసేవారో కమెడియన్‌ బ్రహ్మానందం గారిని కూడా అలానే చూసేవారు. బ్రహ్మానందం గారికి దక్కిన గౌరవం మళ్లీ ఎవరికీ దక్కలేదు. గతంలో ఒక సినిమా అంటే అన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. కథ బాగుంటే చాలు. ఇవన్నీ కాలంతో పాటు మారుతుంటాయి.

మిమ్మల్ని మళ్లీ దర్శకుడిగా చూడాలనుకుంటున్నాం. మీ ఫ్యూచర్‌ ప్లాన్‌ ఏంటి?

దశరథ్: కచ్చితంగా చూస్తారు. మంచి కథలు ఉండి సమయం ఉంటే దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతానికి రైటర్‌గా ఉన్నా. అలాగే చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నా. హ్యాపీగా ఉన్నా.

నటుడిగా కూడా కనిపించనున్నారుట? నిజమేనా?

దశరథ్: నిజమే. నాకు నటించాలని ఆసక్తి లేదు. కానీ నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో ఓ పాత్ర కోసం అనుకున్నవి కుదరలేదు. దీంతో నేను నటుడిగా మారాను.

మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు కథలు రాశారు?

దశరథ్: మా అమ్మ గృహిణి, నాన్న వ్యవసాయం చేస్తారు. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వాళ్లిద్దరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా భార్య డాక్టర్‌. నాకు ఇద్దరు పిల్లలు.

నేను దర్శకత్వం చేసిన ప్రతి సినిమా కథ నాదే. నేను రాసుకున్నదే. డైలాగ్‌లు మాత్రం 3 సినిమాలకు రాశాను.  నాకు దర్శకుడు విశ్వనాథ్‌గారు ఏం తీసినా నచ్చుతుంది. మణిరత్నం గారి సినిమాలు నచ్చుతాయి. రీసెంట్‌గా అట్లీ సినిమాలు బాగుంటున్నాయి. 

మీరు రాసిన ‘కథా రచన’ పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉంది.. ఎలా అనిపిస్తోంది?

దశరథ్: కథ గురించి మనకు ఓ ఆలోచన వచ్చిన దగ్గరి నుంచి అది తెరపై కనిపించే వరకు ఏం చేయాలి.. ఎలా చేయాలనే దాని గురించి ఈ పుస్తకంలో రాశాను. ఇది చదివితే సినిమాపై తపన పెరుగుతుంది. చాలా చిన్న పుస్తకం. కానీ ఎంతో ఉపయోగపడుతుంది. దానికి ముందుమాట సుకుమార్‌ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని