Virat - Rohit: ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ - రోహిత్ జోడీ

శ్రీలంకతో మ్యాచ్‌లో (IND vs SL) స్వల్ప వ్యవధిలో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఔటైనప్పటికీ.. ఓ ప్రపంచ రికార్డును మాత్రం తమ ఖాతాలో వేసుకున్నారు.

Published : 12 Sep 2023 17:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ సూపర్ -4లో (Asia Cup 2023) భాగంగా శ్రీలంకతో టీమ్ఇండియా (IND vs SL) తలపడుతోంది. అయితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులను జోడించిన బ్యాటర్లుగా నిలిచారు. ఇంతకుముందు వరకు వెస్టిండీస్‌ దిగ్గజ ద్వయం గార్డన్ గ్రీనిడ్జ్‌ - డెస్మాండ్ హేన్స్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. వారిద్దరూ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను తాకారు. 

ఇప్పుడు విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ (Rohit Sharma - Virat Kohli) కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు వేల పరుగుల భాగస్వామ్యం నిర్మించడం విశేషం. ఇందులో 18 సార్లు సెంచరీ భాగస్వామ్యం, 15 సార్లు హాఫ్ సెంచరీల పార్టనర్‌షిప్‌ ఉంది. దాదాపు 62.47 సగటుతో పరుగులు చేశారు. అత్యధికంగా 2018లో ఆసీస్‌పై 246 పరుగులను జోడించారు. అయితే, ఇప్పుడు శ్రీలంకపై కేవలం 10 పరుగులు మాత్రమే జోడించారు. కోహ్లీ కేవలం 3 పరుగులకే ఔట్‌ కాగా.. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ సాధించి పెవిలియన్‌కు చేరాడు. అంతేకాకుండా ఆసియా కప్‌లోనూ ఐదు వందల పరుగుల భాగస్వామ్యం కూడా దాటేశారు.

పదివేల క్లబ్‌లో రోహిత్

ఆసియా కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ ఓ మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. అయితే, విరాట్ తర్వాత అత్యంత వేగంగా పది వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌ రోహిత్ కావడం విశేషం. కోహ్లీ 205 ఇన్నింగ్స్‌లో చేయగా.. రోహిత్ 241 ఇన్నింగ్స్‌ల్లో పది వేల మార్క్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్‌ తెందూల్కర్ (259 ఇన్నింగ్స్‌లు), గంగూలీ (263), రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. భారత్‌ నుంచి పది వేల క్లబ్‌లోకి చేరిన ఆరో ఆటగాడిగా.. అంతర్జాతీయంగా 15వ బ్యాటర్‌ కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని