జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్‌

పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్‌ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్‌-1 ఐజీ సస్పెండ్‌ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది.

Updated : 20 Apr 2024 05:27 IST

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడిని తప్పించారనే ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్‌ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్‌-1 ఐజీ సస్పెండ్‌ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో హైదరాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌రూం ఎస్సై చంద్రశేఖర్‌ను కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి సస్పెండ్‌ చేశారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సుదర్శన్‌, చీఫ్‌ ఆఫీస్‌ ఐటీ సెల్‌ డీఎస్పీ రాజశేఖర్‌రెడ్డిపై డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలోని రోడ్‌ నంబర్‌ 45 ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ ఉన్నా.. అతడిని తప్పించేలా దర్యాప్తును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో సుదర్శన్‌ బంజారాహిల్స్‌ ఏసీపీగా, రాజశేఖర్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా, చంద్రశేఖర్‌ జూబ్లీహిల్స్‌ ఎస్సైగా ఉన్నారు. ఇద్దరు డీఎస్పీలపైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరిగినా.. అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. రోడ్డుప్రమాదం జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని