Kenya: కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి

కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 29 Apr 2024 15:46 IST

నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యా (Kenya)లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 

కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌లో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దిగువ ప్రాంతాల్లోకి నీరు ప్రవహించింది. పలు ఇళ్లు, ఒక ప్రధాన రహదారి ధ్వంసమైంది. వరదల్లో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ‘‘డ్యామ్ ధ్వంసం కావడం వల్ల 40 మంది వరకు మృతి చెందారు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇంకా పలువురు బురదలో చిక్కుకొని ఉన్నారు. వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’’ అని స్థానిక యంత్రాంగం వెల్లడించింది.

కాగా.. భారీ వర్షాలకు ఇప్పటికే ఈ దేశంలో మరణాలు సంభవిస్తుండగా, డ్యామ్‌ ఘటనతో  ఆ సంఖ్య 120కి చేరింది. ఎల్‌నినో వల్లే సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికే పాఠశాలలకు ఇచ్చిన మధ్యంతర సెలవుల్ని పొడిగించాల్సి వచ్చింది. ఇదిలాఉంటే.. పొరుగుదేశం టాంజానియాలో కూడా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో వరదలు, కొండచరియలు కారణంగా  అక్కడ 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని