
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. బైడెన్ రిహార్సల్ వాయిదా!
అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ముందు అమెరికాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోసారి నిరసనకారుల నుంచి ముప్పు పొంచి ఉందని ఎఫ్బీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించతలపెట్టిన బైడెన్ ప్రమాణస్వీకార రిహార్సల్ కార్యక్రమాలన్నీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అమెరికాలోని 50 రాష్ట్రాల రాజధానుల్లో, వాషింగ్టన్ డీసీలో నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడే అవకాశముందని ఎఫ్బీఐ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రెగ్యులర్ రైళ్లు ఇప్పట్లో లేనట్లే
ప్రయాణాలు బాగా పెరగడంతో రెగ్యులర్ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీనిప్రకారం రెగ్యులర్ రైళ్లు ఏప్రిల్, ఆ తర్వాతే అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొవిడ్కు ముందు రెగ్యులర్ సర్వీసులు రోజుకు 13 వేల పైచిలుకు నడిచేవి. కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకల్ని రద్దుచేసిన రైల్వేశాఖ మే నెల నుంచి దశలవారీగా పట్టాలు ఎక్కిస్తూ వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఫిబ్రవరి 15 నుంచి 6, 7, 8 తరగతులు?
రాష్ట్రంలో ఫిబ్రవరి 15 నుంచి 6, 7, 8వ తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 1నుంచి 9, 10వ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం తెలిసిందే. అది మొదలయ్యాక రెండు వారాలపాటు తరగతుల నిర్వహణ, సమస్యలు, లోపాలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 6, 7, 8వ తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు తరగతుల్లో మొత్తం 17 లక్షల మంది వరకు విద్యార్థులు ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సొంతానికో గూడు!
కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారిలో ఎక్కువ మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందిన ఫ్లాట్ కొంటే జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేకపోవడం వంటి వెసులుబాటును దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇదివరకు చిన్నచిన్న అపార్ట్మెంట్లలోనూ ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం కనీసం 1000 చ.అడుగులకు తక్కువ ఉండేది కాదు. ఇప్పుడు 600-900 చ.అడుగుల ఫ్లాట్ల నిర్మాణానికీ సిద్ధమవుతున్నారు. కాస్త తక్కువ ధరల్లో లభించే వీటిని కొనేవారికి... జీఎస్టీ, వడ్డీ రాయితీలు ఉండటంతో ఇప్పుడిప్పుడే వాటికీ గిరాకీ పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘కొవిన్’.. ఆరోగ్య సమాచార గని
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆసాంతం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొ-విన్ పోర్టల్.. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. డేటా సేకరణ, విశ్లేషణకు ఇది మున్ముందు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చిన్నారులు, గర్భిణులకు వేస్తున్న పది రకాల టీకా వివరాలను ఆన్లైన్లో నమోదుచేస్తున్నా.. కొవిన్ పోర్టల్ అంత సమగ్రంగా లేవు. దేశంలో విడతలవారీగా చేపట్టిన కొవిడ్ టీకా ‘డ్రై రన్’ సందర్భంగా ఎదురైన అనుభవాలతో కేంద్రం దీన్ని ఆధునికీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భార్గవరామ్ బడిలోనే పథక రచన!
రాజధానిలో కలకలం రేపిన ప్రవీణ్రావు సోదరుల అపహరణ కేసులో బోయిన్పల్లి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. యూసుఫ్గూడలో భార్గవరామ్ నిర్వహిస్తున్న ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్లోనే కిడ్నాప్కు పథక రచన జరిగిందని గుర్తించారు. అపహరణకు ముందురోజు (జనవరి 4, 2021) ఆ పాఠశాలలో అఖిలప్రియ సమావేశం నిర్వహించారని ధ్రువీకరించుకున్నారు. రోజంతా జరిగిన సమావేశంలో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, గుంటూరు, విజయవాడలకు చెందిన ఇతర నిందితులు పాల్గొన్నారని గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ముక్క కొరకలేరు!
గత కొద్దిరోజులుగా ఎక్కువ మంది మేక, గొర్రె మాంసం తినేందుకే మొగ్గుచూపుతున్నందున దానికి అనూహ్యంగా గిరాకీ పెరిగింది. ధరలు కొండెక్కాయి. గత నెలరోజుల్లోనే కిలో ధర రూ.600 నుంచి రూ.750కి ఎగబాకింది. రెండు, మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో రూ.1000 వరకూ అమ్ముడైంది. కనుమ పండగ నాడు హైదరాబాద్ నగరంలోనే మూడు లక్షల కిలోలకుపైగా మాంసం విక్రయాలు జరిగినట్లు అనధికార అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* బాగా ఉడికిన కోడిమాంసం, గుడ్లు తినొచ్చు
8. కూలి పనులకు వెళుతూ మృత్యువాత
అనంతపురం జిల్లా గుంతకల్లు సరిహద్దులో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కొనకొండ్ల సమీపంలో 18 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కొత్తకొత్తగా ఇడ్లీ వడ్డించండి!
ఆవిరి మీద ఉడికే తెల్లని ఇడ్లీలు... తాకితేచాలు మాసిపోయేలా భలే ఉంటాయి కదా... ఆరోగ్యానికి ఎంత మంచివైనా.. చప్పగా ఉండే వీటినే ఎప్పుడూ తినాలంటే కాస్త కష్టమే అనుకుంటున్నారా... అయితే మసాలాలు అద్దిన ఈ గరంగరం ఇడ్లీలు మీ కోసమే. తడ్కా ఇడ్లీ, ఇడ్లీ టిక్కా, ఇడ్లీ మంచూరియా, చిల్లీ ఇడ్లీ, ఇడ్లీ 65.. ఇలా ఎన్నో రకాలుగా ఇడ్లీని తయారు చేసుకొని ఆస్వాదించొచ్చు. ఆ తయారీ విధానం ఏంటో మీరూ తెలుసుకోండి మరి..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. గబ్బా టెస్టు: పంత్ ఔట్.. భారత్ 200/6
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. తాజాగా రిషభ్ పంత్(23) ఆరో వికెట్గా వెనుతిరిగాడు. హేజిల్వుడ్ వేసిన 66.3 ఓవర్కు మూడో స్లిప్లో గ్రీన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 186 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు మయాంక్ అగర్వాల్(38) సైతం హేజిల్వుడ్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి