
తాజా వార్తలు
అణ్వాయుధాగారానికి చైనా పదును
నేలమాళిగలో రహస్యంగా కొత్త ప్రయోగ కేంద్రాలు
వాషింగ్టన్: చైనా తన అణ్వాయుధాగారానికి పదును పెడుతోంది. నేలమాళిగలో ప్రత్యేకంగా ప్రయోగ వేదికలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా సరికొత్త అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఇటీవల చైనాలోని ఒక క్షిపణి శిక్షణ కేంద్రంలో జరిగిన నిర్మాణాలకు సంబంధించి లభ్యమైన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన అమెరికా ఆయుధ నిపుణుడు హాన్స్ క్రిస్టెన్సెన్ ఈ మేరకు పేర్కొన్నారు. అమెరికా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి చైనా సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
అమెరికా, రష్యా, చైనా అణ్వస్త్ర బలగాలపై క్రిస్టెన్సెన్ దీర్ఘకాలంగా పరిశీలనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన ఉపగ్రహ చిత్రాల ద్వారా.. జిలాంటాయ్లోని క్షిపణి పరీక్ష వేదిక వద్ద చైనా రహస్య కార్యకలాపాలను విశ్లేషించారు. అక్కడి నేలమాళిగలో గత ఏడాది 11 క్షిపణి ప్రయోగ వేదికల నిర్మాణాలను డ్రాగన్ మొదలుపెట్టిందని ఆయన తెలిపారు. ఇప్పటికే అక్కడ మరో ఐదు వేదికల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం చైనా వద్ద 18-20 నేలమాళిగ ప్రయోగ కేంద్రాలు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. ‘‘ఇలాంటి చోట్ల క్షిపణులను భద్రపరచడం ద్వారా.. అణ్వస్త్ర దాడిని తట్టుకొని, ప్రతిదాడికి సులువుగా సిద్ధపడే రీతిలో తన ఆయుధాగారాన్ని తీర్చిదిద్దుకుంటున్నట్లు స్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే చైనా తన ప్రయోగ వేదికలను మూడింతలు చేసుకున్నా.. అది అమెరికా, రష్యా వద్ద ఉన్న సామర్థ్యాల ముందు దిగదుడుపేనని క్రిస్టెన్సెన్ పేర్కొన్నారు. అమెరికా వద్ద ఇలాంటివి 450 వరకూ ఉన్నాయని తెలిపారు. చైనా కొత్తగా నిర్మిస్తున్న నేలమాళిగ కేంద్రాలన్నీ కొత్తతరం డీఎఫ్-41 అనే ఖండాంతర క్షిపణులను మోహరించడానికి వీలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రైలు, రోడ్డుపై తరలించడానికి వీలైన డీఎఫ్-41 రకాలనూ డ్రాగన్ ఇప్పటికే అభివృద్ధి చేసిందన్నారు.
ఆయుధపోటీకి దారితీస్తుందా?
చైనా అణ్వస్త్ర ఆధునికీకరణను కారణంగా చెబుతూ.. వచ్చే రెండు దశాబ్దాల్లో వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి, సరికొత్త అణ్వాయుధాగారాన్ని నిర్మించేందుకు అమెరికా కసరత్తు చేపట్టింది. నిజానికి అమెరికా, చైనాలు సాయుధ ఘర్షణ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎక్కడా సూచనలు లేవు. అయితే వాణిజ్యం నుంచి జాతీయ భద్రత వరకూ అనేక అంశాలపై అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో వెలువడిన క్రిస్టెన్సెన్ నివేదిక కలకలం సృష్టిస్తోంది.