
తాజా వార్తలు
అవసరమైనప్పుడు ఎవర్ని పిలవాలో తెలుసు : ఏబీడీ
ఉసేన్ బోల్ట్ ట్వీట్పై డివిలియర్స్ స్పందన
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ ఫీవర్ మొదలైంది. రేపటి నుంచి 50 రోజుల పాటు అతిపెద్ద క్రికెట్ పండుగ మొదలుకానుంది. దీంతో అన్ని జట్లూ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిపోరులో ముంబయి ఇండియన్స్తో పోటీపడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే, ఆర్సీబీని ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ప్రింటర్, పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ బుధవారం కొత్త ప్రయత్నం చేశాడు. ఆ జట్టు ఎర్ర రంగు జెర్సీ ధరించి ‘ఛాలెంజర్స్ మీకో విషయం తెలియజేస్తున్నా. నేనింకా అత్యంత వేగంగా పరుగులు తీసేవాడినే’ అని పేర్కొంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
దానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్తో పాటు ప్యూమా క్రికెట్, ఆర్సీబీ జట్టును కూడా బోల్ట్ ట్యాగ్ చేశాడు. కాగా, ప్యూమా ఇటీవలే ఆర్సీబీ అధికారిక కిట్ స్పాన్సర్గా మారింది. బోల్ట్ సైతం అదే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. మరోవైపు బోల్ట్ చేసిన ట్వీట్కు విరాట్ కోహ్లీ, డివిలియర్స్ స్పందించారు. ‘‘నీ శక్తి సామర్థ్యాల్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే, ఇప్పుడు నిన్ను మా టీమ్లో చేర్చుకున్నాం’’ అని కోహ్లీ పేర్కొనగా.. ‘‘మాకు ఎక్కువ పరుగులు అవసరమైనప్పుడు ఎవర్ని పిలవాలో తెలుసు’’ అని డివిలియర్స్ రీట్వీట్ చేశాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించని సంగతి తెలిసిందే. దీంతో ఈసారైనా కోహ్లీసేన కప్పు గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.