JNVST 2024: జవహర్‌ నవోదయ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

JNVST 2024: దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ అప్పుడే మొదలైపోయింది. పూర్తి వివరాలివే..

Updated : 19 Jun 2023 20:41 IST

దిల్లీ: రాబోయే విద్యా సంవత్సరానికి (2024-25) జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇప్పుడే వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 649 జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2024) నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా నవంబర్‌ 4(శనివారం)న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో; 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఆగస్టు 10వరకు https://navodaya.gov.in/nvs/en/Home1  వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

  • అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
  • వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
  • ప్రవేశ పరీక్ష: జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో JNV అధికారిక వెబ్‌సైట్‌ https://navodaya.gov.in/nvs/en/Home1 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. 

పరీక్ష ఇలా.. 

నిర్ణీత తేదీల్లో ఉదయం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు రెండు గంటల పాటు జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో మెంటల్‌ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. దాంతో పాటు అర్థమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు; లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఇస్తారు. మెంటల్‌ ఎబిలిటీకి గంట సమయం ఉండగా.. మిగతా రెండింటికీ చెరో అర్దగంట పాటు సమయం ఇస్తారు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని