గూగుల్‌ అంటే జగన్‌కు కోపం!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 16 Oct 2025 04:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం 

ఈనాడు, అమరావతి: ‘గూగుల్‌లో 6093 నంబర్‌ కొడితే వైకాపా అధినేత జగన్‌రెడ్డి జైలు జీవితం బయటకొస్తుంది. ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ అని కొడితే తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆయన దోచుకున్న రూ.వేల కోట్ల అవినీతి బయటకొస్తుంది. గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారానే మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకులను సీబీఐ గుర్తించింది. బహుశా అందుకే ఆయనకు గూగుల్‌ మీద కోపం ఉండొచ్చు’ అని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడాన్ని వైకాపా వారు జీర్ణించుకోలేకపోతున్నారని బుధవారం ఓ వీడియో ప్రకటనలో మండిపడ్డారు. గూగుల్‌ రాష్ట్రానికి రావడానికి, రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కృషే కారణమని కొనియాడారు. ‘ఇంత ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే మీ సాక్షి పత్రికలో కనీసం ఒక్క లైన్‌ రాయరా? సాక్షి టీవీలో ఒక్క మాట చెప్పరా...2 లక్షల మందికి ఉపాధి కల్పించే అంతర్జాతీయ సంస్థ రావడం మీకు ఇష్టం లేదా? మీరు రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టం. మళ్లీ నేనే వస్తానని మీరు చెప్పడం అంతకన్నా దురదృష్టం’ అని జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


‘గూగుల్‌ టేక్‌ అవుట్‌’తో ఆధారాలు సేకరిస్తారనే వైకాపా వాళ్ల భయం 

 గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 

ఈనాడు, అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్‌ టేక్‌ అవుట్‌ నుంచి ఆధారాలు సేకరించినట్టే... తమ విషయాలు తెలుసుకుంటారనే వైకాపా వాళ్లకు ‘గూగుల్‌’ అంటే భయమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి వస్తుంటే వైకాపా వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడం దేశంలోనే తొలిసారి. గూగుల్‌ను ఏదో ఊరు, పేరూ లేని కంపెనీగా వైకాపా వాళ్లు విమర్శలు చేస్తున్నారు’’ అని వెంకట్రావు దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు