YSRCP: రాబందుల రాజ్యహింస!

అధికారదండాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల మీదా.. తమకు గిట్టనివారిపైనా దానిని ప్రయోగిస్తూ.. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ.. వైకాపా ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గాలు ఎన్నో! అస్మదీయులు, అనుయాయులు ఎన్ని పాపాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు.. తమ పంచన చేరని వారిపై మాత్రం విరుచుకుపడుతున్నారు.

Updated : 22 Nov 2023 07:58 IST
మాట కాదంటే పగబట్టి వేధింపులు
ఆర్థిక వనరులపై దాడులు
వైకాపాలో చేరలేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను వెంటాడిన ఫ్యాక్షన్‌ నైజం
క్వారీలు మూయించి.. మిల్లులకు తాళాలు
రూ. 280 కోట్లకు పైగా జరిమానాలు
వందల కోట్లు నష్టపోయేలా ప్రణాళిక
ఈనాడు - అమరావతి
అధికారదండాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల మీదా.. తమకు గిట్టనివారిపైనా దానిని ప్రయోగిస్తూ.. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ.. వైకాపా ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గాలు ఎన్నో! అస్మదీయులు, అనుయాయులు ఎన్ని పాపాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు.. తమ పంచన చేరని వారిపై మాత్రం విరుచుకుపడుతున్నారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి దాడులకు తెగబడడం.. భారీ జరిమానాలతో బెంబేలెత్తించడం.. చివరకు వారి వ్యాపారాలు మూతపడేలా ఉక్కిరిబిక్కిరి చేయడం.. ఇలాంటి అరాచకాలెన్నో!! బాపట్ల జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఉదంతమే దీనికొక ఉదాహరణ.
రవికుమార్‌ ఒకప్పుడు వైఎస్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు.. 2019 ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ ఆగ్రహానికి గురై.. అరాచకాలకు బలై.. వందల కోట్లు కోల్పోయారు ఈ తెలుగుదేశం శాసనసభ్యుడు. ప్రతిపక్ష సభ్యుడనే ఒకే ఒక్క కారణంతో ఆయనకు చెందిన క్వారీలను మూయించేసి మిల్లులకు తాళాలేసి వందల కోట్ల జరిమానాలు విధించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధించారు. వైకాపాలోకి రావాలన్న మాట కాదన్నాడనే ఒకే ఒక్క కారణంతో.. ఆయనతో పూర్వ పరిచయాలు, కుటుంబంతో సన్నిహిత సంబంధాల్ని కూడా మరచిపోయి పగబట్టారు. వరస దాడులతో అష్టదిగ్బంధనం చేసి ఆర్థిక మూలాల్ని దెబ్బతీస్తున్నారు. భూస్వామ్య మనస్తత్వం, పెత్తందారీ పాలనకు, ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఇది మచ్చుతునక. ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా గ్రానైట్‌ రంగంలోని వ్యాపారులకు, కార్మికులకు మీరు చెప్పిందేంటో.. అధికారంలోకి వచ్చాక చేసిందేంటో ఎమ్మెల్యే రవికుమార్‌ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. రాజ్యహింస అంటే ఎలా ఉంటుందో గొట్టిపాటి లక్ష్యంగా సాగిన రాక్షస క్రీడే నిదర్శనం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన రవికుమార్‌.. జగన్‌ పిలుపు మేరకు 2013 సంవత్సరంలో వైకాపాలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. తర్వాత తెదేపాలో చేరారు.
2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి తెదేపా తరఫున గెలుపొందారు. వైకాపాలో చేరాలనే ఆహ్వానాన్ని అంగీకరించని ఫలితంగా కక్ష సాధింపు మొదలైంది. మొత్తం గ్రానైట్‌ వ్యాపారాన్నే వదిలేయాల్సి వచ్చింది. ఆయన వ్యాపార సహచరులు, అనుయాయులు కూడా నష్టపోయారు. వందలమంది కార్మికులు, సిబ్బంది ఉపాధి కోల్పోయారు.

ఫ్యాక్షన్‌ నైజమంటే ఇదే!

ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే ఫ్యాక్షన్‌ రాజకీయంలో మొట్టమొదటి పాఠం. అందులో పీహెచ్‌డీ చేసిన నేత.. అధికారం దక్కిందే తడవుగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాలపై కన్నేశారు. ప్రకాశం జిల్లాలోని గ్రానైట్‌ సామ్రాజ్యాన్ని గుప్పిట పట్టేందుకు వ్యూహాలు రచించి.. మొత్తం మైనింగ్‌ కార్యకలాపాల్ని స్తంభింపజేశారు. అందులో భాగంగానే కొందరు తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. వారిలో గొట్టిపాటి రవికుమార్‌తో వికృత రాజకీయ క్రీడ ప్రారంభించారు.

అధికార బలగంతో క్వారీలు మూయించి

రాజ్యం తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది అన్నట్లుగా వివిధ శాఖల అధికారులతో దండయాత్ర ప్రారంభించారు. అక్రమ మైనింగ్‌ పేరుతో దాడులు చేయించారు. రవికుమార్‌కు చెందిన 11 సంస్థల కార్యకలాపాల్ని నిలిపేయించారు. ఏకంగా రూ. 280 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అంటే ప్రకాశం జిల్లాలో సుమారుగా ఒక ఏడాది మైనింగ్‌ రాబడికి ఇది సమానం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా.. వెంటాడి వేధించారు. ఎగుమతులు నిలిపేయించారు. క్వారీలు మూసేయించారు. మిల్లులకు తాళాలేశారు. మొత్తంగా మైనింగ్‌ వ్యాపారాన్ని దెబ్బతీశారు.

ఒక్కో సంస్థపై అయిదుకు పైగా కేసులు

క్వారీలు మూయించినా.. కసి తీరక కేసులకూ తెగబడ్డారు. ఇందులో క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయి. ఒక్కో సంస్థపై సుమారు 5 నుంచి 6 కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఆయనకు సంబంధించిన సంస్థలపై 60 పైగా కేసులు పెట్టారు. అన్నివైపుల నుంచి ఉచ్చు బిగించారు. ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడంతోపాటు అడుగు వేయలేని పరిస్థితి కల్పించారు. దీంతో రవికుమార్‌ సహా ఆయన సహచరులు కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ప్రభుత్వ దాడి నుంచి రక్షించుకునేందుకు ఆయన హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి జరిమానాల నుంచి ఉపశమనం పొందారు.
రూ. 100 కోట్ల యంత్రాలకు తుప్పు
క్వారీలు, మిల్లులు మూత పడటంతో వాటిలోని సుమారు రూ. 100 కోట్లకు పైగా విలువైన యంత్ర పరికరాలు తుప్పు పట్టాయి. నిరుపయోగంగా తయారయ్యాయి. వాటికి నెలవారీ కిస్తీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. చివరకు తుప్పు పడుతున్న యంత్ర పరికరాలను రూ. 15 కోట్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. మైనింగ్‌ కార్యకలాపాల కోసం చేసిన బకాయిలు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆయన క్వారీలు, మిల్లుల్లో పనిచేసే వందల మంది కార్మికులతోపాటు.. గుమస్తాలు, ఇతర సిబ్బందికి ఉపాధి దూరమైంది. మైనింగ్‌ ఆదాయం రూపంలోనూ ఏడాదికి రూ. 100 కోట్ల చొప్పున చూసినా నాలుగేళ్లలో సుమారు రూ. 400 కోట్లకు పైగా నష్టపోయారు. అధికారమే అండగా.. ఆయన ఆర్థిక మూలాలపై మొత్తంగా రూ. 500 కోట్లకు పైగా దెబ్బ కొట్టారు. ఇదీ రాష్ట్రంలో సాగుతున్న రాజ్యహింస తీరు!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని