icon icon icon
icon icon icon

యూపీలో కొడితేనే కేంద్రంలో అధికారం

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ఫలితాలు ఎంత ముఖ్యమో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Published : 22 Apr 2024 04:29 IST

చరిత్ర చెబుతున్న సత్యమిదే..!

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ఫలితాలు ఎంత ముఖ్యమో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1951 నుంచి 1971 వరకు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో దిల్లీలో సంపూర్ణ మెజార్టీతో జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీల నేతృత్వంలో పటిష్ఠ ప్రభుత్వాలు ఏర్పడగలిగాయి. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఆత్యయిక పరిస్థితి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అప్పటివరకు యూపీలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌.. 1977లో అక్కడ సున్నాకు పడిపోయి కేంద్రంలో తొలిసారి అధికారాన్ని చేజార్చుకొంది. నాటి ఎన్నికల్లో భారతీయ లోక్‌దళ్‌ గుర్తుపై పోటీ చేసిన జనతా పార్టీ యూపీలో 85 సీట్లు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 295 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో దక్కిన 154 సీట్లలో అత్యధిక వాటా   ఆంధ్రప్రదేశ్‌(41)దే.


‘బోఫోర్స్‌’ ఆరోపణలతో..

1980 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ యూపీలో మళ్లీ బలపడింది. అక్కడ 51 సీట్లు గెల్చుకోవడంతో.. ఇందిరాగాంధీ నేతృత్వంలో మరోసారి సంపూర్ణ మెజార్టీతో దిల్లీలో అధికారం చేపట్టింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఏకంగా 83 సీట్లు వచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ 414 స్థానాలు దక్కించుకొని.. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో స్వతంత్ర భారతదేశంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రాజీవ్‌గాంధీ పరిపాలనపై విమర్శలు, బోఫోర్స్‌ కుంభకోణం ఆరోపణలు చుట్టుముట్టడంతో 1989 నాటికి యూపీలో కాంగ్రెస్‌ 15 స్థానాలకు పడిపోయింది. దేశవ్యాప్తంగా దాని సంఖ్యాబలం 197కు పడిపోయింది. కేంద్రంలో సొంతంగా సర్కారును ఏర్పాటుచేయలేని పరిస్థితి వచ్చింది. 143 స్థానాలు గెల్చుకున్న జనతాదళ్‌.. ఇతర పక్షాల మద్దతుతో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 1989 ఎన్నికల్లో యూపీలో జనతాదళ్‌ 54 సీట్లు  దక్కించుకుంది.

కమలదళం బలపడి..

1991 రాజీవ్‌గాంధీ హత్యకు ముందే యూపీలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ 5 సీట్లకే పరిమితమైంది. భాజపా 51 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రాజీవ్‌ హత్యానంతరం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హస్తం పార్టీకి మంచి ఫలితాలొచ్చాయి. దేశవ్యాప్తంగా అది 232 సీట్లు గెల్చుకొని పీవీ నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ యూపీలో 5 సీట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా దాని సంఖ్యాబలం 140కి తగ్గింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఏకంగా 52 స్థానాలు గెల్చుకొని.. దేశవ్యాప్త బలాన్ని 161కి పెంచుకుంది. వాజ్‌పేయీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే రెండు వారాల్లోపే ఆ సర్కారు కూలిపోయింది. తర్వాత దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ల నాయకత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభుత్వాలు మెజార్టీని నిరూపించుకోలేక కూలిపోవడంతో 1998లో జరిగిన ఎన్నికల్లో భాజపా మరోసారి యూపీలో 50కిపైగా సీట్లు గెల్చుకుంది. 182 సీట్లతో దేశంలో వరుసగా రెండోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాడు వాజ్‌పేయీ నేతృత్వంలో ఏర్పడ్డ సర్కారు ఏడాదిన్నరలోపే కూలిపోవడంతో 1999లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికల్లో యూపీలో కమలదళం బలం 29కే పరిమితమైనా, మిగిలిన రాష్ట్రాల్లో బలం పుంజుకుంది. దానికితోడు తెలుగుదేశం పార్టీ వంటి పక్షాల మద్దతుతో ఎట్టకేలకు వాజ్‌పేయీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. 1999 ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 29, బీఎస్పీ 14, కాంగ్రెస్‌ 10 సీట్లు గెల్చుకున్నాయి.


మోదీ హవాతో..

2004 ఎన్నికల్లో భాజపా యూపీలో 10 సీట్లకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా దాని సంఖ్యాబలం 138కి పరిమితమైంది. యూపీలోని ప్రధాన పార్టీలుగా అవతరించిన ఎస్పీ, బీఎస్పీల సహకారంతో మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2009లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 21 సీట్లు దక్కించుకొని.. కాంగ్రెస్‌ మరోసారి సంకీర్ణ సర్కారును ఏర్పాటుచేయగలిగింది. 2014, 2019ల్లో మోదీ హవా కారణంగా భాజపా యూపీలో తిరుగులేని సంఖ్యలో సీట్లు గెలుచుకొని.. కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img