icon icon icon
icon icon icon

ఓట్ల ‘దక్షిణ’ ఎవరికో?

దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఈ నెల 26వ తేదీన తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

Updated : 23 Apr 2024 07:41 IST

కన్నడనాట పోరు రసవత్తరం
కొత్త నాయకులను విజయం వరించేనా..
ద్విముఖ పోటీలో పైచేయి ఎవరిది?
26న 14 నియోజకవర్గాల్లో పోలింగ్‌

ఈనాడు, బెంగళూరు: దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఈ నెల 26వ తేదీన తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన భాజపా, జేడీఎస్‌ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌ ఒంటరిగానే నిలిచింది.   భౌగోళిక, సామాజిక పరిస్థితుల పరంగా చూస్తే ఉత్తర     కర్ణాటకకు భిన్నమైనది దక్షిణ కర్ణాటక ప్రాంతం. ఇక్కడ ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలూ భిన్నంగానే ఉంటాయి. ఆ   కారణంగా పార్టీలు ఈ ప్రాంతానికి ప్రత్యేక వ్యూహాన్ని రచించి వాటిని ఆచరణలో పెడుతుంటాయి.


నియోజక వర్గాలు

ఉడుపి-చిక్కమగళూరు, హాసన, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ (ఎస్‌సీ), తుమకూరు, మండ్య, మైసూరు-కొడగు, చామరాజనగర (ఎస్‌సీ), బెంగళూరు గ్రామీణం, బెంగళూరు ఉత్తర, బెంగళూరు కేంద్ర, బెంగళూరు దక్షిణ, చిక్కబళ్లాపుర, కోలారు (ఎస్‌సీ)


కొత్తవారి జోరు

పొత్తు కారణంగా కోలారు, హాసన, మండ్య స్థానాలను జేడీఎస్‌కు వదిలేసి మిగిలిన 11 చోట్ల భాజపా పోటీ చేస్తోంది. ఇందులో 8 మంది సిటింగ్‌లను పక్కనబెట్టింది. ఉడుపి- చిక్కమగళూరు సిటింగ్‌ ఎంపీ శోభా కరంద్లాజెను బెంగళూరు ఉత్తరకు మార్చింది. మొత్తం 10 చోట్ల కొత్తవారు పోటీ చేస్తుండగా, నలుగురు సిటింగ్‌లు మరోసారి బరిలో దిగారు.


ప్రభావిత అంశాలు..

2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రధాన బలం. రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్యారంటీలను అమలు చేసిన ఆ పార్టీకి ప్రధాని మోదీ ప్రభావం ఎప్పటిలాగే గట్టి పోటీ ఇవ్వనుంది.

  • ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న కరవు పరిస్థితులు భాజపాకు అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. కరవు పరిహారం కోసం రాష్ట్ర సర్కారు పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించినా ఇంతవరకూ సాయం చేయలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు, జీఎస్‌టీ పరిహారం చెల్లించలేదని అంటోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నివేదికలు ఇవ్వలేదని, రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధుల ప్రస్తావన ఆర్థిక సంఘం తుది నివేదికలో లేదని కేంద్ర సర్కారు వాదిస్తోంది. ఈ అంశాలే ప్రచారంలో కీలకంగా మారాయి.
  • బెంగళూరుకు తాగునీరు లేకున్నా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడం, ఇక్కడి మౌలిక సదుపాయాలు, పాత మైసూరు ప్రాంతంలోని 4 స్థానాల్లో జేడీఎస్‌, భాజపాల పొత్తు, ఒక్కలిగ ఓటర్లు, బెంగళూరులో బాంబుల మోత, హిందువులపై దాడులు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదీ..

కోలారు

కోలారు కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ప్రాంతమే అయినా 2019లో భాజపా గెలిచింది. ఇక్కడి నుంచి గతంలో 6సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి కేహెచ్‌ మునియప్ప గత ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి టికెట్‌ తన అల్లుడికి ఇప్పించుకోవాలని ఆయన చివరి వరకూ పోరాడినా పార్టీలో విభేదాల కారణంగా బయటి వ్యక్తికి దక్కింది. బెంగళూరుకు చెందిన కేవీ గౌతమ్‌కు టికెట్‌ రాగా.. ఆయనకు మునియప్ప వర్గం నుంచి మద్దతు కరవైంది. జేడీఎస్‌ నుంచి అంతగా పేరులేని మల్లేశ్‌ బాబుకు టికెట్‌ దక్కింది. సిటింగ్‌ ఎంపీ మునిస్వామితోపాటు భాజపా నేతల మద్దతుపై ఆయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. తాగునీరు, నిలిచిపోయిన బంగారు గనుల తవ్వకం, ఉపాధి, కాలుష్యం, మౌలిక వసతులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

ఓటర్లు: 16,31,850


బెంగళూరు గ్రామీణం

కాంగ్రెస్‌, భాజపాల్లోని కీలక నేతల వ్యక్తిగత ప్రతిష్ఠకు బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం వేదిక. ఇక్కడ గత 17 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్‌, 3 సార్లు జేడీఎస్‌, ఒకసారి భాజపా గెలిచాయి. అభ్యర్థులిద్దరూ ఒక్కలిగ వర్గానికి చెందినవారు కావడం.. ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్‌ పోటీ పడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. రాజకీయ అనుభవం లేకపోవడం మంజునాథ్‌ బలహీనత కాగా, మోదీ ప్రభావం కాంగ్రెస్‌ అభ్యర్థికి అడ్డంకిగా మారనుంది.

ఓటర్లు: 27,63,910


మండ్య

మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి బరిలో ఉండటంతో ఇక్కడ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఒక్కలిగల సామ్రాజ్యంగా పరిగణించే మండ్యలో 2004 వరకూ కాంగ్రెస్‌ అప్రతిహతంగా విజయం సాధిస్తూ వచ్చింది. 2009 నుంచి జేడీఎస్‌కు ఇది కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో కుమార స్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ రాజకీయ అరంగేట్రం చేసినా స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఓడిపోయారు. భాజపాతో పొత్తులో భాగంగా ఈసారి కుమార స్వామి నేరుగా బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బిలియనీర్‌ వెంకటరమణ గౌడ పోటీ చేస్తున్నారు. దాదాపు 8 లక్షలకు పైగా ఒక్కలిగ ఓట్లున్న ఈ స్థానంలో గెలుపు ఎన్డీయే నేతలకు ఎంతో కీలకం.

ఓటర్లు: 17,10,901


మైసూరు-కొడగు

మైసూరు మహారాజుల వంశస్థుడు, సాధారణ కార్యకర్త మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. మైసూరు యువరాజు యదువీర్‌ ఒడెయార్‌ స్వయంగా బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత జిల్లా కావడంతో ఈ స్థానంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 4.7 లక్షల మంది ఒక్కలిగలున్న ఈ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ 47ఏళ్ల తర్వాత ఆ వర్గానికి టికెట్‌ ఇచ్చింది. రాజ వంశీకులు సాధారణ రాజకీయ నేతగా రాణిస్తారా.. అని ఓటర్లింకా సంశయంతోనే ఉన్నా అవినీతికి పాల్పడక పారదర్శకంగా వ్యవహరిస్తారన్న విశ్వాసం ప్రజలకు ఉండటం యదువీర్‌ బలం.

ఓటర్లు: 20,92,222


హాసన

జేడీఎస్‌ అధినేత హెచ్‌.డి.దేవెగౌడ రాజకీయ పుట్టిల్లుగా పరిగణించే హాసనలో పోటీ రసవత్తరంగా మారింది. ఇదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన దేవెగౌడ 2019లో మనవడి కోసం త్యాగం చేశారు. ఈసారి ప్రజ్వల్‌ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడతో గతంలో పోటీ పడిన పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్‌ పాటిల్‌ తలపడుతున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ ఉద్దండుల వారసులు ఈసారి పోటీ చేస్తుండటం ఆసక్తికరం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌ సాధించిన ఏకైక స్థానం హాసనే. ఇక్కడ భాజపా, జేడీఎస్‌ కార్యకర్తలు బద్ధ శత్రువులుగా ఉంటారు. ఈ పార్టీలు ఇప్పుడు మిత్రులుగా మారడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పార్టీల కుమ్ములాట నుంచి కాంగ్రెస్‌ లాభపడే అవకాశం లేకపోలేదు.

ఓటర్లు: 17,24,908


  • పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 26
  • ప్రాంతాలు: దక్షిణ కర్ణాటక, పాత మైసూరు, కరావళి
  • లోక్‌సభ స్థానాలు: 14
  • మొత్తం ఓటర్లు: 2,85,42,534

రెండో విడత ఎన్నికలు జరిగే నియోజక వర్గాలు

2019 ఫలితాలు

  • భాజపా: 11
  • కాంగ్రెస్‌: 1,  జేడీఎస్‌: 1
  • స్వతంత్రులు: 1
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img