Gaddar: గద్దర్‌.. బుల్లెట్‌ నుంచి బ్యాలెట్‌ వరకు..!

ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలన్న గద్దర్‌ (Gaddar).. బుల్లెట్‌ను వదిలి బ్యాలెట్‌ను చేత పట్టారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టారు.

Published : 06 Aug 2023 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ (Gaddar).. కేవలం సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని విశ్వసించిన వ్యక్తి. పీపుల్స్‌ వార్‌, మావోయిస్టు పార్టీ, తెలంగాణ ఉద్యమం.. ఇలా ఏ ఉద్యమంలో పాల్గొన్నా.. తన ప్రసంగాలు, పాటలతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. అప్పట్లో తుపాకీ చేతపట్టి ఉద్యమాలు చేసిన గద్దర్.. ప్రజాస్వామ్య పండుగగా చెప్పుకొనే ఎన్నికల్లో (ఐదు దశాబ్దాల్లో) ఎన్నడూ ఓటు వేయలేదు. అటువంటి వ్యక్తి.. ఏకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ (Save Democracy) ఉద్యమాన్నే చేపట్టారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన ఆయన.. చివరకు స్వయంగా రాజకీయ పార్టీనీ (Gaddar Praja Party) స్థాపించారు. ఇలా ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలన్న ఆయన ‘బుల్లెట్‌ నుంచి బ్యాలెట్‌’ వరకు సాగిన ప్రయాణాన్ని పరిశీలిస్తే..

1980ల్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గద్దర్‌.. జన నాట్యమండలిని (Jana Natya Mandali) స్థాపించారు. సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధించవచ్చని ప్రజలను చైతన్యవంతం చేసేవారు. తన ప్రసంగాలు, పాటలతో గ్రామీణ ప్రాంత ప్రజలను ఉత్తేజపరిచేవారు. చివరకు ఆ బృందాన్ని ‘పీపుల్స్‌ వార్‌’లో.. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఆయనపై హత్యాయత్నం జరగడంతో కొంతకాలం అన్నింటికీ దూరంగా ఉన్నారు. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం మరోసారి ఊపందుకుంది. ఆ సమయంలో తన గళానికి మళ్లీ ఊపిరిపోసిన ఆ యుద్ధనౌక.. ఏడు పదులు వచ్చే వరకూ ఎన్నడూ ఓటెయ్యలేదు. చివరకు 2018లో ఎన్నికల సమయంలో తొలిసారి ఓటరుగా నమోదు చేసుకొన్నారు. అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్‌ 7న తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పెత్తందారీ వ్యవస్థపై ధిక్కార స్వరం... గద్దర్‌

ఆ తర్వాత కూడా రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించిన గద్దర్‌.. మావోయిస్టులూ తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుపాకులను ఆశ్రయించకుండా బ్యాలెట్‌ను వినియోగించాలని అన్నారు. అంబేడ్కర్‌ రచించిన ‘రాజ్యాంగం’ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని ప్రచారం చేశారు. దేశ రాజకీయాలు కులం, మతం చుట్టూ తిరుగుతున్నాయని వాపోయారు. రాజకీయం అంటే అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని అణచివేసే ఓ శక్తి అని.. అదే తలవంచితే సమాజానికి అన్యాయం జరుగుతుందని అనేక సందర్భాల్లో చెప్పారు.

పార్టీని స్థాపించి..

ఇలా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసిన గద్దర్‌.. ఏకంగా రాజకీయ పార్టీనే స్థాపించారు. ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ అనే పేరు పెట్టిన ఆయన.. గద్దర్‌ అంటే ఓ విప్లవమని.. ఇది ప్రజా యుద్ధమని పేర్కొన్నారు. త్వరలోనే తమ పార్టీకి గుర్తింపు వస్తుందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ప్రతి ఇంటినీ ఓ ఎన్నికల కేంద్రం చేయాలని.. ఓటు విలువ తెలియజెప్పాలని అన్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయాలు.. పార్లమెంటరీ వ్యవస్థలో కనిపిస్తోన్న మార్పులే తనను ఉద్యమం నుంచి ఓట్ల విప్లవం వైపు అడుగులు పెట్టేలా చేయశాయన్నారు. అందుకే ఓట్ల విప్లవానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని