Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 20 May 2023 21:12 IST

1. ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్‌.. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పార్టీ మారను.. భాజపాలోనే ఉంటా: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రాష్ట్రంలో భారాసను  ఓడించగల పార్టీ భాజపా మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ, భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని..భాజపాలోనే ఉంటానని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జితసేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40గంటల సమయం పడుతోంది. శుక్ర, శనివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. దిల్లీని పడగొట్టి.. ప్లేఆఫ్స్‌కు చెన్నై

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సూపర్‌ విక్టరీతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. సీఎస్కే నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యఛేదనలో దిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ట్విటర్‌కు పోటీగా మెటా నుంచి కొత్త మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ..!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను (Twitter) ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్నప్పటి నుంచి అందులో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ట్విటర్‌లో పాలసీ పరమైన  నిబంధనలు మార్పులు కొందరికి రుచించడం లేదు. దీనిపట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌కు పోటీగా మాస్టోడాన్‌, ట్విటర్‌ మాజీ బాస్‌ జాక్‌ డోర్సీ బ్లూ స్కై వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సుప్రీం తీర్పును ఆర్డినెన్స్‌తో అడ్డుకుంటారా?: కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రాణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అందుకే సర్వోన్నత న్యాయస్థానానికి మే 18 నుంచి వేసవి సెలవులు ఉన్నట్లు తెలుసుకొని, ఒక్క రోజు తర్వాత  ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఉక్రెయిన్‌ యుద్ధం ‘మానవత్వ సమస్య’.. పరిష్కారానికి హామీ ఇస్తున్నా!

జపాన్‌ (Japan)లో జరుగుతోన్న జీ7 సదస్సు (G7 Summit) క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)ని కలిశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌- రష్యా (Russia) వివాదాన్ని మానవత్వానికి సంబంధించిన సమస్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. దీనికి పరిష్కారం కనుగొనేందుకు భారత్ సాధ్యమైనంత మేర కృషి చేస్తుందని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. తిరుగులేని చెన్నై.. పన్నెండోసారీ ప్లేఆఫ్స్‌లోకి!

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో రికార్డు సృష్టించింది. మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా ఇప్పటికే రికార్డుకెక్కిన చెన్నై.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి మరీ చెన్నై (CSK) ప్లేఆఫ్స్‌ను బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో మొత్తం 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన ఏకైక జట్టు సీఎస్‌కే. ఆ తర్వాత ముంబయి (ఈ సీజన్‌లో కాకుండా) 9 సార్లు చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. సిద్ధరామయ్య జోరు.. గంటల వ్యవధిలోనే ఆ 5 హామీలకు ఆమోదం

తీవ్ర చర్చోపచర్చల తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  సిద్ధరామయ్య (Siddaramaiah) 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ (DK Shivakumar) ప్రమాణం చేయగా.. తొలి విడతగా 8 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. టెర్రరిస్టులు దొరక్క.. బిస్కెట్లు తినేసి వెళ్లిపోయారు..!

పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇంట్లో టెర్రరిస్టులు నక్కారంటూ ఇటీవల పంజాబ్ మంత్రి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా శుక్రవారం పోలీసు బృందం ఇమ్రాన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. మాజీ ప్రధానితో చర్చలు జరిపింది. ఇమ్రాన్‌ చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ ఇఫ్తికార్‌ గుమాన్‌ ఈ సోదాలపై వ్యంగ్యంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు