Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jul 2023 13:15 IST

1. గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరదనీటిలో తేలియాడిన కార్లు..!

భారీ వర్షాలు(Heavy Rains) గుజరాత్(Gujarat)ను అతలాకుతలం చేస్తున్నాయి. మరికొన్ని రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఈ క్రమంలో వానల కారణంగా రాజ్‌కోట్‌, సూరత్‌, గిర్‌ సోమనాథ్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. మంగళవారం పలుచోట్ల 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నిపుణుల కొరత ఉంది.. H-1B వీసాలు పెంచండి: అమెరికా ప్రభుత్వానికి కంపెనీల అభ్యర్థన

నిపుణుల కొరత తీవ్రంగా ఉండటంతో హెచ్‌-1బీ(H-1B) వీసాల కోటాను 65,000 నుంచి రెట్టింపు చేయాలని 2,100 చిన్న, మధ్య శ్రేణి ఐటీ కంపెనీలు అమెరికా(USA) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీటిల్లో భారతీయుల నిర్వహణలోనివి కూడా చాలా ఉన్నాయి. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్‌, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బ్రిటన్‌లో రిషి పాపులారిటీ పడిపోతోంది..!

యూకే(UK ) ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) పాపులారిటీ అక్టోబర్‌ నుంచి చూస్తే అత్యంత కనిష్ఠానికి పడిపోతోందని ఓ పోలింగ్‌ కంపెనీ సర్వే పేర్కొంది. దీంతో  ఆయన నాయకత్వంలో కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధించడంలో సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. బ్రిటన్‌లో దాదాపు 65శాతం మంది ఓటర్లు ఆయనకు ప్రతికూలంగా ఉండగా.. 25శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. ‘యూ గవ్‌ పోల్‌’ పేరిట నిర్వహించిన సర్వేలో దాదాపు 2,151 మంది బ్రిటన్‌ వాసుల అభిప్రాయాలను సేకరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గండి పోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో బుధవారం ఉదయానికి గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది. దీంతో ఆలయంలో దర్శనాలను దేవాదాయశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ సమీపంలోని స్థానికులు దుకాణాలను ఖాళీ చేసి వెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బ్రిజ్‌భూషణ్‌ తరఫున ఆ లాయర్‌..!

మహిళా క్రీడాకారిణులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ తరపున న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ వాదనలు వినిపించారు. ఆయన 2012లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హోదాలో నిర్భయ కేసులో దిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించారు. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు నిందితులకు 2020లో ఉరిశిక్ష అమలైంది. ఈ కేసు దేశ స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శక్తిమంతమైన పాస్‌పోర్టు జాబితాలో అగ్రస్థానంలో సింగపూర్‌.. మరి భారత్‌ స్థానం..?

ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టు (strongest passport) కలిగిన దేశంగా సింగపూర్‌ (Singapore) జపాన్‌ను అధిగమించి ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోస్టు ఉన్న వారు వీసా (Visa) రహితంగా, వీసా ఆన్‌ అరైవల్‌ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. గత ఐదేళ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న జపాన్‌ (Japan) ఈసారి మూడోస్థానానికి పడిపోయింది. వీరి పాస్‌పోర్టు ద్వారా గతంలో 193 దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది. కానీ.. ప్రస్తుతం 189 దేశాల్లో మాత్రమే పర్యటించవచ్చు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. త్వరలో పవన్‌కల్యాణ్‌తో భేటీ: పురందేశ్వరి

ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టమాటా సాగుతో నెలలోనే రూ.3 కోట్లు..

ప్రస్తుతం టమాటా (tomato) ధరలు తారస్థాయికి చేరాయి. ఎక్కడ చూసినా కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి టమాటా సాగు చేస్తున్న రైతులకు ఈ ధరలు కలిసిరావడంతో వారి పంట పండింది. తాజాగా మహారాష్ట్రలోని పుణెకు (pune) చెందిన ఈశ్వర్ గైకార్‌ టమాటా సాగుతో కేవలం నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్లను సంపాదించాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జగన్‌.. నమ్మి భూములిస్తే రైతులను రోడ్డున పడేస్తారా?: అమరావతి ఐకాస

అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద రైతులు, ఐకాస నేతలు మహాధర్నా చేపట్టారు. సాయంత్రం 4గంటల వరకు ఈ నిరసన కొనసాగించనున్నట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఇండియా’ పేరు.. నీతీశ్‌కు నచ్చలేదట..!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేపై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన విపక్షాలు (Opposition alliance).. తమ కూటమికి ఇండియా (INDIA)గా నామకరణం చేశాయి. ఈ పేరును కూటమిలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో సమ్మతించాయని విపక్ష నేతలు తెలిపారు. అయితే, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) మాత్రం ఈ పేరును తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇతర పార్టీల నేతలు సర్దిచెప్పడంతో చివరకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని