Swati Maliwal: వేధింపులు డ్రామా కాదు.. మీవే చెత్త రాజకీయాలు: మాలీవాల్‌

తనపై జరిగిన వేధింపులు డ్రామా కాదని, ఈ సమయంలో భాజపానే చెత్త అబద్ధాలు ఆడుతోందని స్వాతి మాలీవాల్‌(Swati Maliwal) మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Updated : 21 Jan 2023 12:59 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ(Delhi)లో మహిళా కమిషన్‌(DCW) ఛైరపర్సన్ స్వాతి మాలీవాల్‌(Swati Maliwal)కు ఎదురైన వేధింపులు డ్రామా అంటూ భాజపా(BJP) నేతలు విమర్శలు చేశారు. ఇదంతా దిల్లీ పోలీసులను చెడుగా చూపించేందుకేనని నిందించారు. దీనిపై మాలీవాల్‌ కూడా అంతేఘాటుగా స్పందించారు.

‘నా గురించి చెత్త అబద్ధాలు చెప్పి, నన్ను భయానికి గురిచేయాలనుకునే వారికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ చిన్న జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. ఎన్నో సార్లు దాడులు చేశారు. కానీ నేను ఆగలేదు. ప్రతి దాడితో నాలో ఉన్న జ్వాల మరింత రగులుతూనే ఉంది. నా గళాన్ని ఎవరూ అణచివేయలేరు. నేను జీవించి ఉన్నంత కాలం పోరాడుతూనే ఉంటా’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

తాను వేధింపులకు గురయ్యానంటూ ఆమె చేసిన ఆరోపణలపై భాజపా(BJP) అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ ఘటనలో నిందితుడు ఆప్‌ సభ్యుడని వెల్లడించింది. దిల్లీ.. మహిళలకు సురక్షితమైంది కాదని చూపడం ద్వారా అంతర్జాతీయంగా నగరం పరువు తీసేందుకు ఆప్‌ చేసిన కుట్రలో ఈ డ్రామా భాగమంది. అది ఇప్పుడు బయటపడిందని విమర్శించింది. దిల్లీ పోలీసుల పరువు తీసేందుకు.. కేంద్రం మీద దాడి చేసేందుకు ఈ డ్రామాకు పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహిళ భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయంలో ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సబబేనా..? అంటూ భాజపా విరుచుకుపడింది. దీంతో మాలీవాల్‌ దీటుగా స్పందించారు.

దిల్లీలో మహిళా భద్రతను పరిశీలించేందుకు స్వాతి మాలీవాల్‌(Swati Maliwal) గురువారం తెల్లవారుజామున నగరంలోని కొన్ని ప్రదేశాల్లో తన బృందంతో పాటు పర్యటించిన సమయంలో.. అటుగావచ్చిన వ్యక్తి తన  కార్లో కూర్చోమని ఆమెను అడిగాడు. రెండుసార్లు అలాగే జరిగేసరికి.. నిందితుడిని పట్టుకోవడానికి స్వాతి కారు లోపలకు చేయి పెట్టడంతో అతడు కారు అద్దాన్ని పైకి వేసేశాడు. ఈ క్రమంలో ఆమె చెయ్యి ఇరుక్కుపోయింది. అలానే కారుని 15 మీటర్లు ముందుకు తీసుకుపోయాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ నిందితుడిని 47 ఏళ్ల హరీష్‌ చంద్రగా గుర్తించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. అతడిని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని