venky atluri: ‘చంద్రముఖి’ చూసొచ్చి వారం రోజులు ఇంట్లో లైట్లు వేసుకునే పడుకున్నా!
‘తొలిప్రేమ’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి- తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఇప్పుడు ధనుష్ను ‘సార్’గా మార్చి తెలుగు, తమిళ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసిన వెంకీ.. తన సినీ ప్రయాణం గురించి ఏం చెబుతున్నాడంటే...
వెండితెరపైన అందమైన ప్రేమకథలతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి. యాక్టర్ అవ్వాలని సినీ పరిశ్రమకొచ్చిన ఈ యువ దర్శకుడు ఒకప్పుడు నటిస్తూనే డైలాగులూ రాశాడు. క్రమంగా మెగా ఫోన్ పట్టుకుని ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి- తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఇప్పుడు ధనుష్ను ‘సార్’గా మార్చి తెలుగు, తమిళ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసిన వెంకీ.. తన సినీ ప్రయాణం గురించి ఏం చెబుతున్నాడంటే...
నేను కలెక్టర్ కావాలన్నది అమ్మ కల. బ్యాడ్ యాక్టర్ని అన్నది నాన్న మాట. ఈ రెండింటికీ మధ్యలో మొదలైందే నా సినిమా ప్రయాణం. కాలేజీలో బోరింగ్ క్లాస్లో కూర్చుని మొదటిసారి కథ రాసుకున్న క్షణంలో నేనసలు అనుకోలేదు. కథలు రాస్తానని.. వాటిని నేనే సినిమాలుగా తెరకెక్కిస్తానని. మనం అనుకోనివి జరగడమే కదా జీవితం. డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న నేను అసలు హీరోను అవుదామని సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. రెండు సినిమాల్లో నటించాక అనూహ్యంగా నా ప్రయాణానికి బ్రేక్ పడింది. నేను హీరో మెటీరియల్ కాదని అర్థమైంది. నాకొచ్చిన కొన్ని అవకాశాల వల్ల నా లక్ష్యం దర్శకత్వమనే మరో మార్గం వైపు మళ్లింది. ఇప్పుడు స్పష్టతతో ఆ బాటలోనే వేగంగా ప్రయాణిస్తూ.. ‘సార్’ అనే మైలు రాయి దగ్గర ఉన్నా. విద్యావ్యవస్థనీ, అందులోని లొసుగుల్నీ చూపించిన ఈ సినిమాను యువతతోపాటు వారిని కష్టపడి చదివించే తల్లిదండ్రుల్నీ దృష్టిలో పెట్టుకుని తీశా.
నువ్వే హీరో అన్నారు
విద్యార్థుల గురించి సినిమా తీశాను అనగానే ముందు నా స్టూడెంట్ లైఫ్ ఏమిటో కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. మాది గుడివాడ దగ్గర వానపాముల. నాన్నది వ్యాపారం. ఆయన చిన్నతనంలోనే మా కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. అమ్మానాన్నలకు ఒక్కడినే సంతానం. నేను కలెక్టర్ అయితే చూడాలన్నది మా అమ్మ కోరిక. చదువులో యావరేజ్ స్టూడెంట్ని. నేను కలెక్టర్ అవ్వడమేంటీ అనుకునేవాడిని. నాకు ఆటలంటే చాలా ఇష్టం. వాటి కోసమే స్కూలుకీ, కాలేజీకీ వెళ్లేవాడిని. ఆ ఆసక్తితోనే క్రికెటర్ అవ్వాలనుకున్నా. పలు రాష్ట్రాలకెళ్లి టోర్నమెంట్లు ఆడేవాడిని. ఒకసారి మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చాయని అమ్మ కోప్పడి క్రికెట్ మాన్పించింది. తరవాత అమ్మానాన్నల కోసమే ఇంజినీరింగ్లో చేరా. చదువుతున్నాగానీ అదే నా లక్ష్యమనిపించలేదు. పైగా ఒక లెక్చరర్ తన క్లాస్కి రాకపోతే ఊరుకునేవారు కాదు. ఆయనకు భయపడి వెళ్లేవాడిని. ఒకసారి ఆయన నాలుగురోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. అందుకే ముందురోజు నాలుగు పీరియడ్లు వరసగా ఆయనే క్లాస్ తీసుకున్నారు. నా బెంచ్మేట్స్ కొందరు మానేశారు. వాళ్లు తప్పించుకోవడం, నేను క్లాస్లో ఇరుక్కుపోవడంతో విసుగొచ్చింది. ఆ చిరాకులో క్లాస్ వినకుండా ఓ కథ రాశా. అప్పుడే నాలో కథ రాసే నైపుణ్యం ఉందని అర్థమైంది. చదివిన ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. అలానే కొందరు హీరోగా ప్రయత్నించమని సలహా ఇచ్చేవారు. పైగా అదే సమయంలో నా స్కూల్మేట్ తరుణ్- నిఖిల్, ఉదయ్కిరణ్ వంటివారు సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. నాకూ సినిమాల్లోకి వెళ్లాలనిపించింది. అది నటుడిగానా, రచయితగానా అన్నది అర్థం కాలేదు. మొదట్లో ఇంట్లో చెప్పడానికి భయపడ్డా. మా బాబాయి ఒకరు గంగోత్రి ఆడిషన్కి పంపారు. కానీ ఎంపిక కాలేదు. వేరేవాళ్లు రాఘవేంద్రరావుగారి దగ్గర అసిస్టెంట్గా అవకాశం ఉంది చేయమన్నారు. అందుకు నాన్న ఒప్పుకోలేదు. అమ్మకేమో నేను సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేదు. ఈలోగా ఒక సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. స్పష్టత లేకుండా పరుగులు తీస్తున్న ఆ సమయంలో మా బాబాయికి తెలిసిన వాళ్లు సినిమా తీస్తున్నారు. విషయం తెలిసి బాబాయి నన్ను ఆ సినిమా ఆఫీసుకి తీసుకెళ్లగానే ‘నువ్వే మా హీరో’ అన్నారు నిర్మాత. అలానే పాస్పోర్ట్ ఉందా అని అడిగారు. ఉందనగానే ఆస్ట్రేలియాలో షూటింగ్ అన్నారు. అదంతా కలో నిజమో అర్థం కాలేదు. పాస్పోర్ట్ ఉన్నందుకే అవకాశం ఇచ్చారేమో అనిపించింది. హీరోగా నాకు మర్యాద ఇస్తుంటే ఆశ్చర్యంగా అనిపించేది. నేను ఎలా చేసినా బాగుంది అనేవారు తప్ప తప్పొప్పులు చెప్పేవారు కాదు. చివరికి సినిమా పూర్తయ్యాక చాలామంది సినీ పెద్దలు ప్రివ్యూ చూసి కామ్గా వెళ్లిపోయారు తప్ప రివ్యూ చెప్పలేదు. థియేటర్లో ఒక్క షో మాత్రమే ఆడి డిజాస్టర్ అయిన ఆ సినిమా పేరు ‘జ్ఞాపకం’. నా జీవితంలో అదో చేదు జ్ఞాపకం. నువ్వు బ్యాడ్ యాక్టర్వి, నీకు నటనే రాదన్నారు నాన్న. అప్పటికీ నా మీద నాకు స్పష్టత లేదు. ఆ డైలమాలో ఉండగానే ‘స్నేహగీతం’లో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయానికి డైలాగ్ రైటర్ రాకపోవడంతో నాకు రాసే ఛాన్స్ దక్కింది. నిజానికి కాలేజీలో విసుగుతో కథ రాయడం తప్ప రచయితగా నాకు ఎలాంటి అనుభవం లేదు. శిక్షణా తీసుకోలేదు. అలాంటిది ఆ సినిమాకి చేయి తిరిగిన రచయితలా మాటలు రాయడం చూసి దర్శకుడు ఆశ్చర్యపోయారు. ఆ తరవాత సినిమాకీ నాకే రైటర్గా అవకాశమిచ్చారు. నిజానికి నటించినప్పుడు కలగని సంతృప్తి రాసినప్పుడు దొరికింది. అలా 2011లో వచ్చిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి మాటలు రాశా. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశా. తరవాత ‘మిస్టర్ మజ్ను’ కథ రాసుకున్నా. దాన్ని తీసుకుని ఉషాకిరణ్ మూవీస్కి వెళ్లా. వాళ్లు కథ చదవకుండా ‘నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్...’ అనడిగారు. ‘హీరోగా, దర్శకుడిగా రెండు పడవల మీద కాళ్లు వేయడం సరికాదు. హీరో అవ్వాలనుకుంటే... మేం ఓ దర్శకుణ్ని చూసుకుని నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాం. అదే నువ్వు దర్శకుడిగా సినిమా తీస్తే హీరోని వెతుకుతాం..’ అన్నారు. నిజానికి అప్పటి వరకూ నన్ను అలా ఎవరూ అడగలేదు. ఆ ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది. వాస్తవానికి నేను హీరో అవ్వాలని సినీ పరిశ్రమకొచ్చా. దానిమీద నాకంత పేషన్, ఇష్టం ఉండి ఉంటే రెండో ఆలోచన ఉండేది కాదు. ఒకవేళ నా అసలు లక్ష్యం దర్శకత్వమేనేమో అనుకుని రెండో ఆలోచన వైపే మొగ్గు చూపా.
‘దిల్’ రాజు నమ్మారు
‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి పనిచేస్తున్నప్పుడే దిల్ రాజుగారితో పరిచయమైంది. ఎందుకో తెలియదు గానీ దర్శకుడిగా రాణిస్తానని ఆయన నన్ను నమ్మారు. నా మొదటి సినిమా ‘తొలిప్రేమ’ కూడా వాళ్ల బ్యానర్లోనే చేయాలనుకున్నాం. ఒకవైపు సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకుంటూ ఒక్కో అడుగు వేస్తుంటే- మా అమ్మ మాత్రం నేను సినీ రంగంలోకి రావడం జీర్ణించుకోలేకపోయింది. దాదాపు నాలుగేళ్ల పాటు బాధపడింది. అమ్మానాన్నలిద్దరూ నన్ను ఎలాగైనా ఈ రంగంలోంచి బయటకు తీసుకురావాలని ఆలోచించేవారు. ఒకరోజు ‘మీ అబ్బాయి మంచి దర్శకుడు అవుతాడని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి’ అని దిల్ రాజుగారు చెప్పడంతో నాన్న ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలపైన దృష్టి పెట్టా. ‘మిస్టర్ మజ్ను’ హై బడ్జెట్ మూవీ కావడంతో ఆ కథను పక్కన పెట్టి ‘తొలిప్రేమ’ కథ రాసుకున్నా. ‘ముకుంద’ టీజర్ చూశాక వరుణ్ అయితే ఆ కథకు బాగుంటాడనిపించింది. తనకి కథ చెప్పడానికి ముందు నలుగురైదుగురికి చెప్పి ఉన్నా. చేతినిండా సినిమాలున్న వరుణ్ కూడా ఒప్పుకోడనిపించింది. కానీ విన్న వెంటనే చేస్తానన్నాడు. తీరా ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు వరుణ్ కాలు విరిగింది. పైగా వరుణ్ చేయాల్సిన సినిమాలు ఆగిపోయాయి. తను కోలుకుని అవన్నీ పూర్తిచేసి ‘తొలిప్రేమ’ పట్టాలెక్కడానికి ఏడాదిన్నర పట్టింది. చెప్పలేనంత నిరాశ. నేను చాలామందికి కథ చెప్పి ఉన్నా. ఎవరైనా కాపీ కొట్టొచ్చు, లేదంటే కాన్సెప్ట్ తీసుకోవచ్చు... అని భయపడ్డా. లక్కీగా అలాంటివేం జరగలేదు. ఆలస్యమైనా సజావుగా షూటింగ్ జరిగింది. సినిమా హిట్ అయింది.
ఆ తరవాత ‘మిస్టర్ మజ్ను’ అఖిల్తో చేశా. అదయ్యాక ‘రంగ్ దే’ కూడా అనుకున్న వెంటనే షూటింగ్ మొదలైంది. సగం సినిమా పూర్తి చేశాక కొవిడ్తో లాక్డౌన్ వచ్చింది. మళ్లీ ఎదురుచూపులు. మానసికంగా చాలా ఇబ్బంది పడినా అది ప్రపంచమంతటికీ వచ్చిన సమస్య అని సర్దుకున్నా. కాకపోతే ఆ సినిమా సెకండ్ హాఫ్ విదేశాల్లో చేయాల్సి ఉంది. అనుకున్నన్ని రోజులు అనుమతులు దొరక్క త్వరత్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. అయినా ఆ సినిమాకొచ్చిన ఫలితాలు మాత్రం సంతృప్తినిచ్చాయి. అయితే అప్పటికి నేను తీసిన మూడు సినిమాలూ ప్రేమకథలే. వెంకీ అన్నీ ప్రేమ కథలే తీస్తాడు అనేవారు. ఈసారి దారి మార్చాలనుకున్నా. లాక్డౌన్లో నేను స్వయంగా చూసిన పరిస్థితుల్నే కథగా రాశా. అదేంటంటే... చాలా వరకూ మనదేశంలో విద్య వ్యాపారమైంది. మన విద్యావ్యవస్థ ఎటు వెళుతోందో తెలియక ప్రశ్నించే గొంతుకగా మారి ‘సార్’ కథ రాశా. ఆ లైన్ నిర్మాతలకు నచ్చింది. అప్పుడే కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది గానీ కథ వినిపించడానికి హీరోల అపాయింట్మెంట్లు దొరకట్లేదు. అనుకోకుండా ధనుష్కి చెప్పే అవకాశం వచ్చింది. ఆయన కథ విన్నాక ‘డేట్స్ ఎప్పుడు కావాలి వెంకీ’ అన్నారు. అప్పటికీ ఆశ్చర్యంగా చూస్తున్న నా ముఖం చూసి ‘ఈ కథ నాతో చేయడానికి ఓకే కదా...’ అన్నారు. కథ చెప్పిన వెంటనే ఆయన సినిమా ఓకే చేయడం, షూటింగ్ పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి. పైగా నాకెంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్గారు ‘సార్’ నిర్మాతల్లో ఒకరు. దర్శకులవ్వాలనుకునేవారికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనకీ నా కథ నచ్చింది. ఆ మెప్పుతో దర్శకుడిగా ఇంకో మెట్టు ఎక్కానని అనుకుంటున్నా. ఇక వయసులోనూ, అనుభవంలోనూ నా కంటే పెద్దవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. నేను 24 ఫ్రేమ్స్నూ గౌరవిస్తా. దర్శకుడిగా ఆయా విభాగాల్లో పని చేసేవారి నిర్ణయానికి పెద్దపీట వేస్తా. అదే నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని నమ్ముతా.
అలక
‘తొలిప్రేమ’లో ‘నిన్నిలా నిన్నిలా...’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఆ పాట ట్యూన్ చేసేటప్పుడు అర్మాన్ మాలిక్గానీ, అర్జిత్ సింగ్గానీ పాడితే బాగుంటుంది అన్నారు తమన్. తరవాత చెన్నై వెళ్ళాక ఆ పాట నేనే పాడా అన్నారు. అదేంటీ అంటే... ఏంట్రా నా వాయిస్ బాగోలేదా అన్నారు. అర్మాన్ మాలిక్, అర్జిత్ సింగ్గానీ పాడితే బాగుంటుందని మెంటల్గా ట్యూన్ చేశారు. దాంతో నా మనసులో అదే ఉండిపోయింది. వద్దంటే వద్దన్నా. చివరికి వరుణ్, నిర్మాతలు కూడా నో అనడంతో అర్మాన్ మాలిక్ చేత పాడించారు. ఇక ఆ సినిమాలో తమన్ ఇంకే పాటా పాడలేదు. అలిగారు.
ప్రశంస
‘తొలిప్రేమ’ చూసిన చిరంజీవిగారు నన్ను మెచ్చుకున్నారు. ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఆ పిలుపు వరుణ్ పెదనాన్నగా కాకుండా నా ప్రతిభకుగుర్తింపుగానే వచ్చింది. సినిమా బాగుంటే కొత్త దర్శకుల్ని ఆయన అలానే అభినందిస్తారు. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస అది.
నిర్ణయం
దర్శకుడిగా పలు కోణాల్లో సినిమాలు తీయాలనే ఆలోచన ఉంది. కానీ హారర్ జోలికి మాత్రం వెళ్లను. పైగా అలాంటి సినిమాలు అసలు చూడను. ‘చంద్రముఖి’ చూసొచ్చి వారం రోజులు ఇంట్లో లైట్లు వేసుకునే పడుకున్నా. అంతేకాదు నేను హారర్ సినిమాలు తీసినా అది కామెడీ సినిమాలా ఉంటుందేమో అనిపిస్తుంది.
హెచ్చరిక
నాకు మీమ్స్ చదివే అలవాటుంది. ‘సార్’కు ముందు విడుదలైన నా మూడు సినిమాలూ ప్రేమకథలే. సెకండ్హాఫ్లో కథ విదేశాల్లో ఉంటుంది. వెంకీ ‘నారప్ప’ తీస్తే అది కూడా సెకండ్ హాఫ్ లండన్లో షూట్ చేసేవాడు అంటూ మీమ్స్ వచ్చాయి. బాగా నవ్వుకున్నా. ఆలోచించా కూడా. ఈసారి కాస్త జాగ్రత్త పడ్డా.
స్నేహగీతం
నేను, నితిన్, కీర్తి సురేశ్ బెస్ట్ ఫ్రెండ్స్. మా ముగ్గురికీ ఓ వాట్సాప్ గ్రూపు ఉంది. ‘రంగ్ దే’ షూటింగ్ సమయంలో మా స్నేహం మరింత బలపడటంతో మా గ్రూపు పేరు ‘రంగ్ దే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనే పేరు పెట్టుకున్నాం. ముగ్గురం కలిశామంటే అల్లరే అల్లరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల