సెకండాఫ్‌ బాలేదంటే ఫోన్‌ పెట్టేశాడు..: విజయ్‌ తండ్రి విమర్శలు లోకేశ్‌ కనగరాజ్‌ని ఉద్దేశించేనా..?

కోలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌.

Updated : 28 Jan 2024 10:39 IST

చెన్నై: కోలీవుడ్‌కు చెందిన ఓ చిత్ర దర్శకుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్‌ (Vijay) తండ్రి ఎస్‌.చంద్రశేఖర్‌. సినిమా బాలేదని చెబితే అతడు ఫోన్‌ కట్‌ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘‘విజయ్‌ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటా. వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటా. కానీ, నేటి రోజుల్లో స్క్రీన్‌ప్లేకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమ సినిమాలో ఒక స్టార్‌ హీరో ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదనుకుంటున్నారు. హీరో వల్లే సినిమా హిట్‌ అయినా.. తాను ఏదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడు. కథ బాగుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది నా అభిప్రాయం.

Hanuman: ‘హనుమాన్‌’.. అలాంటివారికి ఇదొక చెంపదెబ్బ : చిలుకూరు ప్రధాన అర్చకులు

మరో ఐదు రోజుల్లో రిలీజ్‌ అనగా.. ఓ సినిమా చూశా. వెంటనే దర్శకుడికి ఫోన్‌ చేసి.. ప్రథమార్ధం చాలా బాగుంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు.. ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పా. నా మాటలకు అతడు.. ‘సర్‌, భోజనం చేస్తున్నా. మళ్లీ కాల్‌ చేస్తా’ అని ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత కాల్‌ చేయలేదు. సినిమా విడుదలయ్యాక చాలామంది నాలానే అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడు నా మాట విని మార్పులు చేసి ఉంటే మరొక విధంగా ఉండేది. నా విమర్శలను స్వీకరించేంత ధైర్యం, పరిణతి అతడికి లేవు’’ అని అన్నారు.

చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతున్నది ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ (Vijay), లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లియో’ (LEO). లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఇది మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. విజయ్‌ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని