
CBN: ధాన్యం బకాయిలు చెల్లించాలి: చంద్రబాబు
సీఎం జగన్కు తెదేపా అధినేత లేఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మద్దతు ధర కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆక్షేపించారు. రైతులను నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 48 గంటల్లోనే రైతులకు నగదు జమ చేశామని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలవుతున్నా అతీగతి లేదని చంద్రబాబు మండిపడ్డారు. అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? ఖరీఫ్కు పెట్టుబడులు ఎవరిస్తారు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2,500 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాయలసీమలో వేరుశెనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ అందలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు ఆర్బీకేల పేరుతో హడావుడి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ- క్రాప్లో నమోదు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన పంటలకు తక్షణమే చెల్లింపులు జరపాలని ఆయన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.