Amaravati News: ‘అమరావతి’ విజయంపై తెదేపా నేతలు షరీఫ్‌, యనమల, దూళిపాళ్ల ఏమన్నారంటే...

ఏపీ ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ

Updated : 03 Mar 2022 15:02 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై పిటిషన్ల హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామన్నా ఆయన.. ఇది అమరావతి రైతుల విజయంగా అభివర్ణించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ఆనాడు నిబంధనల ప్రకారం మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపామని చెప్పారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందని షరీఫ్‌ గుర్తు చేశారు.

హైకోర్టు తీర్పును అమలు చేయాలి.. అప్పీల్‌కు వెళ్లొద్దు: యనమల

ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే మూడు సంవత్సరాలు వృథా చేశారన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన యనమల మీడియాతో మాట్లాడారు. అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని.. అప్పీల్‌కు వెళ్లొద్దని సూచించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి జగన్‌ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కొత్త బిల్లు తీసుకొస్తామనడం విచిత్రంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏం చేయాలన్నా రాష్ట్రపతి, కేంద్రం అనుమతి కావాలని యనమల వివరించారు.

ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అభివృద్ధి చేయాలి: ధూళిపాళ్ల

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని వివాదాలకు సీఎం జగన్‌ స్వస్తి పలకాలని.. స్థానిక రైతులుపై కక్షపూరిత చర్యలు ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని