HCA: హెచ్‌సీఏ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై వేటు

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రక్షాళన చేపట్టింది. బహుళ క్లబ్‌లతో హెచ్‌సీఏను శాసిస్తున్న క్రికెట్‌ పెద్దలకు షాకిచ్చింది.

Updated : 01 Aug 2023 08:04 IST

ఒక దఫా పోటీ చేయకుండా అనర్హత
జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రక్షాళన చేపట్టింది. బహుళ క్లబ్‌లతో హెచ్‌సీఏను శాసిస్తున్న క్రికెట్‌ పెద్దలకు షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్‌లపై జస్టిస్‌ నాగేశ్వరరావు వేటు వేశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఒక దఫా లేదా మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్‌లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలపై నిషేధం విధించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హెచ్‌సీఏ ఎపెక్స్‌ కమిటీకి నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న జస్టిస్‌ నాగేశ్వరరావు కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. హెచ్‌సీఏను గాడినపెట్టే బాధ్యతను స్వీకరించిన జస్టిస్‌ నాగేశ్వరరావు.. అంతకుముందు సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకున్నారు. 80 క్లబ్‌లను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది, వారి కుటుంబ సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు పర్యవేక్షక కమిటీ గుర్తించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన 21 క్లబ్‌లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు పేర్కొంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్‌ నాగేశ్వరరావు.. ఆయా క్లబ్‌ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధుల నుంచి వివరణ తీసుకున్నారు. కొందరు వ్యక్తులు బహుళ క్లబ్‌లు కలిగి ఉండటాన్ని గుర్తించిన జస్టిస్‌ నాగేశ్వరరావు వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్న 57 క్లబ్‌లపై అనర్హత వేటు వేశారు. ఆ క్లబ్‌లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లో ఉన్నవాళ్లు ఒక దఫా లేదా మూడేళ్ల పాటు హెచ్‌సీఏ ఎన్నికలకు దూరమైనట్లు ప్రకటించారు. ఈ క్లబ్‌లు రానున్న ఎన్నికల్లో పాల్గొనకుండా, ఓటు హక్కు వినియోగించకుండా నిషేధం విధించారు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శితో సహా అత్యున్నత పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది రానున్న ఎన్నికలకు దూరమయ్యారు.

శేష్‌ నారాయణ, పురుషోత్తం అగర్వాల్‌, సురేందర్‌ అగర్వాల్‌, ప్రకాష్‌ చంద్‌ జైన్‌, అర్షద్‌ అయూబ్‌, వంకా ప్రతాప్‌, విక్రమ్‌ మాన్‌సింగ్‌, స్వరూప్‌, విజయానంద్‌, జాన్‌ మనోజ్‌ సహా కీలక వ్యక్తులపై వేటు పడింది. జస్టిస్‌ నాగేశ్వరరావు ఉత్తర్వుల నేపథ్యంలో రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో 158 (మొత్తం 215) క్లబ్‌లు ఓటు హక్కు వినియోగించుకోన్నాయి. ఇక తమ క్లబ్‌లన్న జీహెచ్‌ఎంసీ వాదనను జస్టిస్‌ నాగేశ్వరరావు తోసిపుచ్చారు. క్లబ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైంది. జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిచ్చిన జస్టిస్‌ నాగేశ్వరరావు.. ఆ క్లబ్‌ల ప్రతినిధులకు యాజమాన్య హక్కులు ప్రసాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని