కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే.
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. అదృష్టం కొద్దీ ఇవి మనదగ్గర తక్కువే. ఇక్కడ 54.4% అడవుల్లో అప్పుడప్పుడూ, 7.49% అడవుల్లో ఒక మాదిరిగా, 2.40% అడవుల్లో అత్యంత తీవ్రమైన మంటలు రేగుతుంటాయి. కార్చిచ్చుల మూలంగా బయోమాస్ వంటి విలువైన అటవీ వనరులను కోల్పోవాల్సి వస్తోంది. అందుకే వీటి నివారణకు అధునాతన ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్ల సాయం తీసు కుంటున్నారు. మంటలు రేగినా వినూత్న పద్ధతుల్లో ఆర్పటానికి ప్రయత్ని స్తున్నారు. ఇంతకీ కార్చిచ్చులు ఎలా పుట్టు కొస్తాయి? ఎలా ఆర్పుతారు?
కార్చిచ్చు, దావానలం.. పేరేదైనా పచ్చటి అడవుల్లో మంటలు రేగటం అనాదిగా చూస్తున్నదే. ఇవి రాజుకోవటానికి చిన్న నిప్పు రవ్వో, సూర్యుడి వేడో చాలు. ఒక్కసారి అంటుకుందంటే ఎండిన కొమ్మలు, చెట్లే కాదు.. దారిలో ఉన్న దేనినైనా కాలుస్తూ చాలా వేగంగా.. దాదాపు గంటకు 23 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుంది. అప్పటివరకూ పచ్చటి అడవిలా కనిపించింది కాస్తా బూడిద కుప్పలా మారుతుంది. చుట్టుపక్కల వేలాది ఎకరాలను కబళిస్తుంది. ఆవాసాలకు, ప్రజలకు ముప్పుగా పరిణమిస్తుంది.
ఎండా కాలంలోనే ఎక్కువ
కార్చిచ్చులు చాలావరకూ ఎండా కాలం వంటి కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడు పుట్టుకొస్తున్నాయి. చిన్న నిప్పు రవ్వ అయినా దావానలం రాజుకునేలా చేయొచ్చు. రైలు చక్రాలు పట్టాలకు రాసుకున్నప్పుడు పుట్టుకొచ్చే రవ్వలైనా చాలు. కొన్నిసార్లు ఎండ, మెరుపు వంటి సహజ అంశాలూ కార్చిచ్చులకు కారణం కావొచ్చు. అయితే చాలావరకూ మానవ తప్పిదాలే దీనికి దోహదం చేస్తుంటాయి.
ప్రధాన కారణాలు
మండటానికి అవసరమైన వేడితో కూడినవి ఏవైనా కార్చిచ్చులను రేపొచ్చు. పొలాలు, నిర్మాణాల కోసం చెట్లను కాల్చటం, వనవాసానికి వెళ్లినవారు వేసుకునే చలిమంటలు, సిగరెట్లను నిర్లక్ష్యంగా విసిరేయటం, చెత్తను పూర్తిగా కాల్చకుండా అడవుల దగ్గర వదిలేయటం, అగిపెట్టెలు, బాణసంచా, ఉద్దేశపూర్వకంగా మంట పెట్టటం వంటివి కార్చిచ్చులకు కారణమవుతుంటాయి. కలప 300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండుతుంది. కలప ఈ ఉష్ణోగ్రత వరకూ వేడెక్కినప్పుడు పొగరూపంలో హైడ్రోకార్బన్ వాయువులు వెలువడతాయి. ఇవి గాలిలోని ఆక్సిజన్తో కలిసి దగ్ధమవుతాయి. అనంతరం మంట పుట్టుకొస్తుంది.
జ్వాల త్రికోణం
మంట రాజుకోవటానికి, జ్వాలలు రేగటానికి మూడు అంశాలు దోహదం చేస్తాయి. అవి మండటానికి తోడ్పడే ఇంధనం, ఆక్సిజన్ సరఫరా చేసే గాలి, ఇంధనం దహనమయ్యే ఉష్ణోగ్రతకు చేరుకోవటానికి తోడ్పడే వేడి కారకం. అందుకే వేడి, ఆక్సిజన్, ఇంధనాన్ని జ్వాల త్రికోణం (ఫైర్ ట్రయాంగిల్) అని పేర్కొంటారు. మంటలు ఆర్పే సిబ్బంది దీని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. త్రికోణంలో ఒకదాన్ని సమసి పోయేలా చేస్తే మంటల నియంత్రణ తేలికవుతుంది. చివరికి మంటలు ఆరిపోతాయి.
మంచి కూడా..
సహజ కార్చిచ్చు పర్యావరణానికి మేలు చేస్తుంది కూడా. ఉదాహరణకు- కొన్ని చెట్ల గుత్తులు విచ్చుకోవటానికి, వాటి నుంచి విత్తనాలు వెలువడటానికి వేడి అవసరం. ఇలాంటి చెట్ల ఆకులకు మండే స్వభావం గల జిగురు ఉంటుంది. ఇది మంటలకు ఆజ్యం పోస్తుంది. ఇలా తమ విత్తనాలను వ్యాప్తి చేసుకుంటాయి. కార్చిచ్చులు చెట్లకు హాని చేసే కీటకాలు, చీడలు నశించేలా చేస్తాయి. కొత్త గడ్డికి, పొదలకు ఆస్కారం కలిగిస్తాయి. తక్కువ తీవ్రతతో కూడిన మంటలు చెత్తను కాల్చివేస్తాయి. దీంతో నేల అంతటా ఎండ తగులుతుంది. ఫలితంగా చిన్న మొక్కలకు పోషణ లభిస్తుంది. పెద్దవి మరింత ఏపుగా పెరుగుతాయి.
ఆర్పటం కష్టమే..
ఇంధనం, ఆక్సిజన్, వేడి అందినంతవరకూ కార్చిచ్చు రగులుతూనే ఉంటుంది. నివాసాల్లో రేగే మంటలను ఆర్పటం వేరు. అడవుల్లో మంటలను ఆర్పటం వేరు. మంటల వ్యాపిని అరికట్టటానికి కొన్నిసార్లు ముందుగానే కొంత ప్రాంతాన్ని కాల్చి వేస్తుంటారు కూడా. దీంతో కార్చిచ్చు అక్కడి వరకూ వచ్చి ఆగిపోతుంది. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా వేలాది గ్యాలన్ల నీటిని వెదజల్లుతుంటారు కూడా. ఫాస్ఫేట్ ఎరువుతో కూడిన రసాయన రిటార్డెంట్ కూడా వాడుతుంటారు. ఇది మంట నెమ్మదించటానికి, చల్లబడటానికి తోడ్పడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్ అడవుల్లో రేగిన మంటలను ఆర్పటానికి వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్లను వినియోగించటం తెలిసిందే. ఇందుకోసం బాంబీ బకెట్లతో నీటిని వెదజల్లారు. వీటిని హెలీబకెట్ అనీ పిలుచుకుంటారు. తక్కువ బరువుతో కూడిన దీనికి కింద మూత ఉంటుంది. పైలట్ ఆధీనంలో ఉండే వాల్వ్ ద్వారా మూత తీస్తే కింది నుంచి అవసరమైన చోట నీరు పడుతుంది. దీన్ని చాలా కాలంగా మంటలు ఆర్పటానికి వినియోగిస్తున్నారు. చెరువులు, ఈత కొలనుల వంటి నీటి వనరుల నుంచి తేలికగా నీటిని నింపటం దీని ప్రత్యేకత.
బాంబీ బకెట్ను కెనడా వ్యాపారవేత్త డాన్ ఆర్నే 1982లో ఆవిష్కరించారు. అప్పట్లో విమానాల ద్వారా మంటలను ఆర్పే నీటి బకెట్లు సమర్థంగా పనిచేయటం లేదని, చాలావరకూ విఫలమవు తున్నాయని గ్రహించిన ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నీటి బకెట్లను గట్టి ఫైబర్ గ్లాస్, ప్లాస్టిక్, లోహ చట్రంతో కూడిన దళసరి గుడ్డతో తయారుచేసేవారు. ఇవి విమానంలో పెట్టటానికి అనువుగా ఉండేవి కావు. హెలికాప్టర్ హుక్కు తగిలించటం వల్ల వేగంగా ప్రయాణించటమూ సాధ్యమయ్యేది కాదు. పైగా వీటితో కిందికి వదిలే నీరు తుంపర్లుగా మారి, చుట్టుపక్కలకు పోయేది. దీంతో అంత ఫలితం కనిపించక పోయేది. బాంబీ బకెట్తో ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. దీన్ని హెలికాప్టర్లోనే భద్రపరచొచ్చు. అవసరమైనప్పుడు పరిసరాల్లోని చెరువుల వద్దకు వెళ్లి తేలికగా నీరు నింపొచ్చు. పైగా దీనిలోంచి నీరు కిందికి ధారగా పడుతుంది. అవసరమైన చోట కచ్చితంగా నీటిని వదలొచ్చు. తక్కువ నీరు ఆవిరి కావటం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం 115కు పైగా దేశాల్లో బాంబీ బకెట్లను వాడుతున్నారు.
కొత్త టెక్నాలజీలు
కార్చిచ్చులను ఆర్పటానికి కొత్త టెక్నాలజీలూ సాయం చేస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఏఐ ఆధారిత సెన్సర్లు, అధునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్ మోడళ్లతో మంటల తీరుతెన్నులను గమనిస్తూ వ్యాపించకుండా చూస్తున్నారు.
- అధునాతన విమాన పద్ధతులూ దావానలాన్ని ఆర్పటానికి ఉపయోగపడుతున్నాయి. దీనికి ఉదాహరణ- గ్లోబల్ సూపర్ ట్యాంకర్. ఇదో అధునాతన జంబో జెట్ విమానం. ఇది సుమారు 73వేల లీటర్ల వరకూ మంటను నిరోధించే రసాయనాలను మోసుకెళ్తుంది. దీనికి 10వేల లీటర్ల నీటిని మోసుకెళ్లే హెలికాప్టర్ కూడా తోడుగా ఉంటుంది. జీపీఎస్ డేటాతో కూడిన వీడియో క్లిప్లు, సెన్సర్ల ద్వారా ఇది మంటల నివారణకు తోడ్పడుతుంది.
- మానవ రహిత విమానాలు, డ్రోన్లు కూడా కార్చిచ్చులను ఆర్పటానికి దోహదం చేస్తున్నాయి. వీటికి పొగతో ఇబ్బందేమీ ఉండదు. ఇన్ఫ్రారెడ్, థర్మల్ కెమెరాలతో అత్యంత స్పష్టమైన ఫొటోలను తీస్తూ ముందుకు సాగుతాయి. సిబ్బందికి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ప్రమాదకరమైన పరిస్థితులను గుర్తించటానికి తోడ్పడతాయి.
- థర్మల్ కెమెరాలతో కూడిన స్మార్ట్ఫోన్లు కూడా అగ్నిమాపక సిబ్బందికి చేదోడుగా నిలుస్తున్నాయి. పొగలు కమ్మినా వాటిల్లోంచి చూడటానికి, మంటలు రేగటానికి కారణమయ్యే అంశాలను గుర్తించటానికివి తోడ్పడుతున్నాయి.
- అగ్నిమాపక సిబ్బందికి ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్లు కూడా తోడ్పడుతున్నాయి. వీటిల్లో కంప్యూటర్ విజన్తో పాటు శ్వాస తీసుకోవటానికి వెసులుబాటూ ఉంటుంది. వీటిల్లోని థర్మల్ కెమెరాలు పొగల్లోంచి చూడటానికీ వీలు కల్పిస్తాయి. అదే సమయంలో వైర్లెస్గా సమాచారాన్ని కంట్రోల్ కేంద్రాలకు బట్వాడా చేస్తాయి.
- రోబోలూ చేదోడుగా నిలుస్తున్నాయి. ఓ స్వీడన్ యూనివర్సిటీ తయారుచేసిన స్మోక్బాట్ మంటలను ఆర్పటానికి, సహాయ చర్యలకు తోడ్పడుతుంది. రాడార్, లేజర్ స్కానర్, థర్మల్ కెమెరా, గ్యాస్ సెన్సర్లతో కూడిన ఇది పొగ ఆవల ఉన్న విషయాలను తెలుపుతుంది.
విస్తరణకు కారణాలు
ఇంధనం రాజుకున్న తర్వాత మంట పుట్టి, జ్వాలలు ఏర్పడతాయి. ఇవి వ్యాపించటానికి ఇంధనం, వాతావరణం, నైసర్గిక స్వరూపం వంటివి కారణమవుతాయి. మంట త్వరగా ఆరుతుందా? లేదా? జ్వాలగా మారి వేలాది ఎకరాలకు విస్తరిస్తుందా? అనేవి వీటిని బట్టే ఆధారపడి ఉంటాయి.
ఇంధనం: కార్చిచ్చు వ్యాపించటాన్ని చుట్టుపక్కల ఇంధనం రకం, నాణ్యత నిర్దేశిస్తాయి. చెట్లు, పొదలు, ఎండిన గడ్డి క్షేత్రాలు, ఇళ్లు వంటివేవైనా ఇంధనంగా పనిచేయొచ్చు. కొద్దిపాటి ఇంధనం గల మంటలు నెమ్మదిగా వ్యాపిస్తాయి. వీటి తీవ్రత తక్కువ. అదే పెద్దమొత్తంలో ఇంధనం అందుబాటులో ఉంటే తీవ్రంగా మంటలు లేస్తాయి. వేగంగా వ్యాపిస్తాయి. చుట్టుపక్కల పదార్థం ఎంత వేగంగా వేడెక్కితే అంత త్వరగా రాజుకుంటుంది. ఇంధనం సైజు, ఆకారం, అమరిక, తేమ శాతం కూడా మంటల తీవ్రతను నిర్ణయిస్తాయి. పెద్ద కాండాలతో పోలిస్తే ఎండు గడ్డి, ఎండుటాకులు, పుల్లలు, ఎండిన పొదలు త్వరగా మండుతాయి. రసాయన స్థాయిలో చూసుకుంటే వేర్వేరు ఇంధన పదార్థాలు వేర్వేరు వేగంతో మండుతాయి. కానీ కార్చిచ్చులో చాలావరకూ ఒకేరకం పదార్థంతో తయారైన ఇంధనమే ఉంటుంది. అయితే రాజుకునే సమయంలో నేల మీద ఇంధనం పరచుకొన్న విస్తీర్ణం, దాని పరిమాణం నిష్పత్తి మూలంగా మంట రేగుతుంది. మంట పెరుగుతున్నకొద్దీ దాని పక్కనుండే పదార్థమూ ఎండిపోతూ వస్తుంది. వేడి, పొగ కలిసి తేమ ఆవిరయ్యేలా చేస్తాయి. దీంతో మంట చేరుకున్న వెంటనే ఇంధనం తేలికగా జ్వలిస్తుంది. ఒకదగ్గర పోగుపడిన ఇంధనం కన్నా చెల్లాచెదరుగా పడిఉన్న ఇంధనం త్వరగా ఎండుతుంది. ఎందుకంటే ఇలాంటి చోట్ల ఎక్కువ ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది. పోగుపడిన ఇంధనంలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మంట వేడిని గ్రహిస్తుంది. అందువల్ల త్వరగా వేడెక్కదు, మండదు.
వాతావరణం: మంట పుట్టటం, ఎక్కువ కావటం, చల్లారటంలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. కార్చిచ్చులకు కరవు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. గాలులు మంటలను ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. మంటలు త్వరగా వ్యాపించటానికి, మరింత ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించటానికివి దోహదం చేస్తాయి. మంటలను ఆర్పటంలోనూ చిక్కులు కలిగిస్తాయి. ఉష్ణోగ్రత, గాలి, తేమ.. ఈ మూడూ కార్చిచ్చుల మీద ప్రభావం చూపుతాయి. జ్వాల త్రికోణంలో వేడి ఒక అంశం కాబట్టి కార్చిచ్చులు పుట్టటంలో ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ వేడికి నేల మీది కర్రలు, చెట్లు, పొదలు ఎండిపోయి, మంచి ఇంధనాలుగా మారతాయి. వాతావరణం మరింత వేడెక్కినప్పుడు ఇవి రాజుకొని, త్వరగా మండుతాయి. కార్చిచ్చు త్వరగా విస్తరించటానికి దోహదం చేస్తాయి. అందుకే చాలావరకూ కార్చిచ్చులు మధ్యాహ్నం వేళ పుట్టుకొస్తుంటాయి. దావానలం తీరు మీద గాలులు గణనీయ ప్రభావం చూపుతాయి. వీటిని అంచనా వేయటమూ కష్టమే. గాలితో మంటలకు అదనపు ఆక్సిజన్ అందుతుంది. దీంతో మరింత విజృంభిస్తాయి, వేగంగా చుట్టుపక్కలకు విస్తరిస్తాయి. మరోవైపు జ్వాలలు సైతం తమదైన వాతావరణాన్ని ఏర్పరచు కుంటాయి కూడా. ఇది గాలి తీరుతెన్నులనూ మారుస్తుంది. వేడి ప్రభావంతో గాలి వడిగా తిరుగుతూ మంట సుడిగాలులు (ఫైర్ విర్ల్స్) పుట్టుకొస్తాయి. ఇవి మండే కొమ్మలు, నుసిని చాలా దూరాలకూ మోసుకెళ్తాయి. చెట్ల మీద లేచే మంటల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. గాలి వేగం పెరిగినకొద్దీ మంటల వ్యాప్తీ ఎక్కువవుతుంది. ఇవి సృష్టించుకునే గాలి చుట్టుపక్కల గాలి కన్నా 10 రెట్లు ఎక్కువ వేగం కలిగుంటాయి. దీని ప్రభావంతో గాల్లోకి ఎగిసే బూడిద, నుసి వంటివి మరిన్ని మంటలకూ కారణమవుతాయి. గాలులు మంట దిశనూ మార్చగలవు. చెట్ల మీదికీ వ్యాపింపజేయగలవు. మరోవైపు గాల్లోని తేమ మంటలను, వాటి తీవ్రతను తగ్గించటానికి ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే తేమ మంటల వేడిని శోషించుకుంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంధనం తక్కువగా పొడిబారుతుంది. అందువల్ల త్వరగా రాజు కోదు. అదే తేమ తగ్గి నప్పుడు గాల్లో నీటి ఆవిరి మోతాదు తక్కువగా ఉంటుంది. కార్చిచ్చులకు ఇది అనువువైన పరిస్థితిని కల్పిస్తుంది. కాబట్టే మంటల నివారణకు వాన బాగా ఉపయోగపడుతుంది. గాలిలో తేమ సంతృప్త స్థాయికి చేరుకున్నప్పుడు అది వాన రూపంలో కురుస్తుంది కదా. దీంతో ఇంధనంలో తేమ శాతం పెరుగుతుంది. కార్చిచ్చులు రేగకుండా అణచి వేస్తుంది.
నైసర్గిక స్వరూపం: చుట్టుపక్కల నేల తీరుతెన్నులూ కార్చిచ్చుల మీద ప్రభావం చూపుతాయి. ఇది ఇంధనం, వాతావరణం మాదిరిగా మారకపోయినప్పటికీ మంటలు ఉద్ధృతం కావటం, చల్లారటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వాలు గణనీయమై ప్రభావం చూపుతుంది. మనం కిందికి వేగంగా దిగుతాం గానీ మంటలు మాత్రం పైకి త్వరగా వ్యాపిస్తాయి. ఎంత వాలు ఎక్కువగా ఉంటే అంత వేగంగా విస్తరిస్తాయి. దీనికి కారణం చుట్టుపక్కల గాలి దిశ. సాధారణంగా గాలి పైకి ప్రయాణిస్తుంటుంది. మరోవైపు పొగ, వేడి ఎగువకు వ్యాపించటం వల్ల కొండల మీద ఇంధనం ఎండిపోవటం ఆరంభిస్తుంది. ఇది మంట రాజుకోవటానికి అనువైన వాతావరణం కల్పిస్తుంది. పర్వతాల మీద రేగిన మంటలు కిందికి అంతగా వ్యాపించవు. ఎందుకంటే వేడి పైకి పోవటం వల్ల కింద ఉండే ఇంధనాన్ని అంతగా ఎండిపోయేలా చేయదు. అయితే ఇందులో గాలి దిశ కూడా ముఖ్యమే. కొన్నిసార్లు బలమైన గాలులు మంటలు పైకి వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. దీంతో నెమ్మదిగా ఎగువకు విస్తరిస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి