
ఆంధ్రప్రదేశ్
కొవిడ్ నిర్ధరణ పరీక్షలు, ఫలితాల ఆధారంగా ఇళ్లకు...
కొందరి సెల్ఫోన్ల స్విచ్ఛాఫ్
గతనెలలో వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్
ఈనాడు, అమరావతి: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాతో వస్తున్న ప్రయాణికులకు ఎక్కడికక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి సోమవారం వరకు రాష్ట్రానికి చెందిన సుమారు 8వేల మంది విదేశాల నుంచి దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, రాష్ట్రంలోని విమానాశ్రయాలకు చేరుకున్నారు. విమానాశ్రయాల్లో వీరికి పరీక్షలు చేసి, ఫలితం తెలిసిన అనంతరమే ఇళ్లకు పంపిస్తున్నారు. రాష్ట్రంలో వారు నివాసం ఉండే ప్రాంతాల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 8వేల మందికి జరిగిన పరీక్షల్లో 3వేల మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన వారి ఫలితాల వివరాలు అందాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు సెల్ఫోన్లు పనిచేయకుండా స్విచ్చాఫ్ చేశారు. దీంతో వారి వివరాలు తెలుసుకోవడం అధికారులకు సమస్యగా తయారైంది. రాష్ట్ర చిరునామాతో వచ్చినప్పటికీ..కొందరు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఇతరచోట్ల ఉండిపోతున్నారు. ఈ నెల 1 నుంచి విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా విదేశాల నుంచి నవంబరు 15 తరవాత రాష్ట్ర చిరునామాతో ప్రయాణం చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరు 6వేల మంది ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోకి వచ్చిన వారికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.