
తాజా వార్తలు
‘ఇన్సూరెన్స్ను ప్రభుత్వం గంగలో కలిపేసింది’
తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజం
అమరావతి: వైకాపా సర్కారు రైతు వ్యతిరేకిగా మారిందని తెదేపా నేతలు ఆరోపించారు. రైతు స్థిరీకరణ నిధికి రూ.3వేలకోట్ల నిధులు ఇస్తామని మోసం చేశారని తెదేపా ఎమ్మెల్యేలు నిమ్మరామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. శాసనసభ ఆవరణలో నేతలు మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని.. రైతులకు మేలుచేసే ఒక్కపనైనా చేశారా? అని బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. కనీసం ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో ఇవ్వలేకపోతున్నారని ఆక్షేపించారు. జీవోలు ఇచ్చామంటారని.. కానీ అవి అమలుకావని విమర్శించారు.
తెదేపా హయాంలో రూ.3,759 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని.. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019-20లో రూ.84కోట్లు, 2020-21లో రూ.264కోట్లు మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. అరకొర నిధులతో ఇచ్చామని చేతులు దులుపుకోవడం తప్ప రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదని ఆరోపించారు. రైతులకు క్రమంగా వచ్చే ఇన్సూరెన్స్ను ఈ ప్రభుత్వం గంగలో కలిపేసిందన్నారు. బీమా కంపెనీలకు రూ.1300కోట్లు చెల్లించాల్సి ఉండగా ఈ ప్రభుత్వం కేవలం రూ.33కోట్లు మాత్రమే కట్టారని.. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.