
తాజా వార్తలు
8 దశల్లో ఎన్నికలా?.. మోదీ, షా చెప్పారా?
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. భాజపా ఎన్నికల ప్రచారానికి వీలుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు ఎన్నికల తేదీలను ప్రకటించారా? అని ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు ఎన్నికల తేదీల ప్రకటన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే దశలో ఎన్నికలు జరుగుతుంటే.. బెంగాల్లో మాత్రమే ఇన్ని దశల్లో ఎందుకు నిర్వహిస్తున్నారని మమత ప్రశ్నించారు. ఈసీనే న్యాయం చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. భాజపా కోరుకున్నట్లుగానే ఎన్నికల తేదీలు ప్రకటించారని తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందన్నారు. ప్రధాని, హోంమంత్రి తమ అధికారాలను దుర్వినియోగం చేయకూడదని హితవు పలికారు. ఎన్ని కుయుక్తులు పన్నినా బెంగాల్ కుమార్తెగా ఈ రాష్ట్ర ప్రజలు తృణమూల్కే మళ్లీ పట్టం కడతారని విజయంపై ధీమా వ్యక్తంచేశారు.