
తాజా వార్తలు
కేరళ సీఎం విజయన్కు కరోనా
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. చికిత్స నిమిత్తం కొజికోడ్ వైద్య కళాశాలలో చేరనున్నట్టు తెలిపారు. ఇటీవల తనని కలిసి వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కుమార్తె వీణకు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఈ నెల 6న జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించి వచ్చిన ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మార్చి 3న విజయన్ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, కేరళలో గురువారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలోనే 63,901శాంపిల్స్ పరీక్షించగా 4353 కేసులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా ఎర్నాకులంలో 654 కొత్త కేసులు రాగా.. కోయ్కోడ్ 453, తిరువనంతపురం 234, త్రిస్సూర్ 393, మలప్పురం 359, కన్నూరు 334 చొప్పున కొత్త కేసులు నమోదైనట్టు కేరళ వైద్యశాఖ వెల్లడించింది. అలాగే, తాజాగా మరో 18మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు కొవిడ్ మృతుల సంఖ్య 4728కి పెరిగింది. కేరళలో ప్రస్తుతం 33,261 క్రియాశీల కేసులు ఉన్నాయి.