‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు.. SBI తాజా వడ్డీ రేట్లు ఇవే..!

SBI Amrit Kalash: అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ పథకం గడువును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మరోసారి పెంచింది. ఈ ఏడాది చివరి వరకు పథకంలో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది.

Published : 16 Aug 2023 13:38 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు ఆగస్టు 15తో ముగియాల్సి ఉండగా.. ఏడాది చివరి వరకు గడువు పొడిగించింది. డిసెంబర్‌ 31 వరకు ఈ పథకంలో మదుపు చేసే అవకాశం కల్పించింది. గతంలోనూ ఈ గడువును పలుమార్లు ఎస్‌బీఐ పొడిగించింది.

ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. అలాగే రుణ సదుపాయం కూడా ఉంది.

మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్‌ తగ్గిందా? ఇది కారణం కావొచ్చు..!

ఎస్‌బీఐ లేటెస్ట్‌ వడ్డీ రేట్లు..

ప్రస్తుతం ఇతర ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలపై (అమృత్‌ కలశ్ పథకం కాకుండా) 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి గానూ సాధారణ పౌరులకు 3 నుంచి 7 శాతం వడ్డీరేటును ఎస్‌బీఐ చెల్లిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్లు అదనంగా.. 3.5 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 2-3 ఏళ్ల కాలవ్యవధిపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్ఠంగా 7 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. అదే కాలవ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ.2కోట్ల లోపు డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని