Crime News: మహిళా వాలంటీరుపై కీచకపర్వం!

చనిపోయిన బంధువుకు పింఛన్‌ ఆపేశాననే కక్షతో వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు, ఆమె కుటుంబసభ్యులు తనపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించాంటూ శ్రీసత్యసాయి జిల్లా అగళి మండలం కదిరేపల్లికి చెందిన వేద అనే మహిళా వాలంటీరు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 07 Nov 2023 08:53 IST

అగళి, న్యూస్‌టుడే: చనిపోయిన బంధువుకు పింఛన్‌ ఆపేశాననే కక్షతో వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు, ఆమె కుటుంబసభ్యులు తనపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారంటూ శ్రీసత్యసాయి జిల్లా అగళి మండలం కదిరేపల్లికి చెందిన వేద అనే మహిళా వాలంటీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. తనకు, తన కుటుంబానికి మడకశిర వైకాపా ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎంపీటీసీ కుటుంబసభ్యులు, స్థానిక నాయకులతో ప్రాణహాని ఉందని పేర్కొంది. పింఛను ఆపేశాననే కోపంతో ఎంపీటీసీ సభ్యురాలు నింగమ్మ భర్త బసవరాజు, మరికొంతమంది కలిసి మొదట తనతో గొడవపడ్డారని, తర్వాత తన సోదరుడిపై దాడి చేశారని.. ఈ విషయమై ప్రశ్నించడానికి వెళితే తన తమ్ముడిని, తల్లిని కొట్టి, తన దుస్తులు చింపి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. పైగా తమ మీదనే తప్పుడు కేసు పెట్టగా.. సోమవారం తమ కుటుంబ సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. దీనిపై ఎంపీటీసీ భర్త బసవరాజు మాట్లాడుతూ.. వాలంటీరు కుటుంబసభ్యులే తనపై దాడి చేశారని చెప్పారు. ఈ వివాదంపై ఎస్‌ఐ లావణ్యను వివరణ కోరగా, ఇటీవల ఓ వివాదానికి సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వాలంటీరు కుటుంబ సభ్యులు నలుగురిని అరెస్టు చేశామన్నారు. అలాగే ఎంపీటీసీ కుటుంబసభ్యులు 16 మందిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని