వైకాపా నేతల విధ్వంసం
అయిదేళ్లలో పాలకుడి అండతో వైకాపా నేతలు సృష్టించిన ప్రకృతి విధ్వంసం అంతా ఇంతా కాదు.. కనిపించిన కొండను కొల్లగొట్టి..అందుబాటులో ఉన్న ఇసుకను దోచేసి.. అక్కడక్కడా ఉన్న ఎర్రమట్టిని తవ్వేసి.. రూ. కోట్లు దండుకున్నారు.
దర్శిలో కొండలు, కోనలు ఛిధ్రం
ముండ్లమూరులో ఇసుక దోపిడీ
వందలాది వాహనాల్లో మట్టి తరలింపు
అయిదేళ్లలో రూ. వందల కోట్ల దోపిడీ
అయిదేళ్లలో పాలకుడి అండతో వైకాపా నేతలు సృష్టించిన ప్రకృతి విధ్వంసం అంతా ఇంతా కాదు.. కనిపించిన కొండను కొల్లగొట్టి..అందుబాటులో ఉన్న ఇసుకను దోచేసి.. అక్కడక్కడా ఉన్న ఎర్రమట్టిని తవ్వేసి.. రూ. కోట్లు దండుకున్నారు. ఫలితంగా పచ్చని గిరులు..తరులతో పాటు, నదులు నామరూపాలు కోల్పోయాయి. ఇటు పోలీసు.. అటు రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో జిల్లాలో ఈ దోపిడీ స్వేచ్ఛగా.. యథేచ్ఛగా సాగుతూనే ఉంది.
దర్శి, న్యూస్టుడే: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరుల విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగుతోంది. దర్శి మండల పరిధిలో పర్యావరణానికి ప్రతిరూపాలైన కొండలను లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా చెలరేగిపోయింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతో భారీ యంత్రాల సాయంతో తవ్వకాలు చేపట్టి మట్టిని సరిహద్దులు దాటించారు.
దర్శి ప్రాంతంలో వెంకటాచలంపల్లికి సమీపంలో దర్శి-కురిచేడు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న రెండు కొండలు, దర్శి నుంచి దొనకొండకు వెళ్లే మార్గంలో చందలూరుకు సమీపంలోని కొండ, దర్శి నుంచి పోతవరం వెళ్లే మార్గంలో కొండలను వైకాపా నాయకులు కొల్లగొట్టి మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. వీటితో పాటు చలివేంద్రకు సమీపంలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండతో పాటు సమీపంలోని చెరువుల్లోని మట్టిని రోజుకు 100 నుంచి 150 టిప్పర్లతో తవ్వి తరలించారు.
దర్శి : వెంకటాచలంపల్లికి సమీపంలో తవ్వకాలతో తరిగిపోయిన కొండప్రాంతం
అధికారం అండతో..
దర్శి ప్రాంతంలో కొండమట్టి నాణ్యంగా ఉండటం, రియల్ వ్యాపారం ఊపందుకోవటంతో అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకుని ట్రక్కు మట్టిని రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ సరాసరి 100 నుంచి 150 లారీల మట్టి తరలుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన నెలలో రూ.2.5 నుంచి రూ.3 కోట్ల మేర కొల్లగొడుతున్నారు. తెదేపా ప్రభుత్వంలో అవసరమైన మట్టిని తరలింపునకు అద్దె లారీలు వినియోగించాలంటే భయపడే వ్యక్తులు..నేడు లారీ యజమానులుగా మారారు. ప్రధాన మాఫియా వ్యక్తులు పొక్లెయిన్లు, టిప్పర్లను సొంతంగా కొనుగోలు చేసేస్థితికి చేరారంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిల్వ చేయటం ద్వారా వ్యాపారం చేస్తున్నా అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. సంబంధించిన అధికారులు జోక్యం చేసుకుని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చిలకలేరును ఇష్టారాజ్యంగా తవ్వి
దర్శి నియోజకవర్గ పరిధిలో ముండ్లమూరు మండలం చిలకలేరును ఇసుక అక్రమార్కులు దోచుకున్నారు. చిలకలేరు పరిధిలోని పోలవరం, తమ్మలూరు, మల్కాపురం, కుంకుబాడు, మోదేపల్లి రీచ్ల నుంచి రోజుకు 20 నుంచి 60 టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకున్నారు. దర్శి, తాళ్లూరు మండలాల పరిధిలో విస్తరించిన దోర్నపు వాగు, ముసి వాగులో ఇసుక తవ్వకాలతో వాటి రూపురేఖలు మారిపోయాయి.
ప్రభుత్వ ధరకు రెండింతలు వసూలు చేస్తూ..
దర్శి మండలం పోతవరం సమీపంలో యంత్రాల సాయంతో మట్టి తవ్వకం
రాత్రీ, పగలు తేడా లేకుండా తరలిస్తూ వచ్చిన ఆదాయాన్ని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల నాయకులు పంపకాలు చేసుకుంటున్నారు. ఇసుక కావాలంటే వీరు అనుమతులు లేకుండా కొనలేని పరిస్థితి కల్పించారు. వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని బెదిరింపులకు దిగారు. దర్శి ప్రాంతంలో రూ.1,020 టన్ను ధర అని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నా రెండింతలు మూడింతలు వసూలు చేస్తున్నారు. టన్ను ఇసుకను రూ.3,000 వరకు కొనుగోలు చేయవలసి వస్తోందని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
పెద్దలకు నెలకు రూ. లక్ష కప్పం చెల్లిస్తూ..
కలనూతల-1 నిర్వాసితుల కాలనీకి సమీపంలో కొండ మట్టిని తవ్వుతున్న యంత్రాలు (పాత చిత్రం)
మార్కాపురంలో అధికార పార్టీకి చెందిన నేతలు అయిదేళ్లుగా ఈ దందాను అనుయాయులు, తమకు నమ్మకమైన గుత్తేదారులకు అప్పగించి వారి నుంచి నెలవారీ పర్సంటేజీలు దండుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక గుత్తేదారు నెలకు రూ.లక్ష వరకు అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తున్నారు. స్థానికులు పొరపాటున మట్టి, ఇసుకను తరలించుకుంటే అధికారులను ఇళ్లకు పంపి వారిపై జరిమానాలు విధించేలా చేస్తున్నారు.
అధికార పడగ నీడలో పశ్చిమం
రూపురేఖలు కోల్పోయిన వేములకోట చెరువు
మార్కాపురం: వైకాపా నేతల పడగ నీడలో పశ్చిమ ప్రకాశం విలవిల్లాడింది. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో వారికి ఎదురు చెప్పే వారే లేకపోవడంతో దొరికిన మట్టిని దొరికినట్టే దోచుకున్నారు. తమ స్థిరాస్తి వెంచర్లకు తరలించుకున్నారు. ఇలా అయిదేళ్ల కాలంలో దాదాపు రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర మట్టి మాఫియా దండుకుంది.
మార్కాపురం నడిబొడ్డున..
నామరూపాల్లేని మార్కాపురం చెరువు
మార్కాపురం పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్దచెరువుతో పాటు మండలంలోని వేములకోట చెరువు, దరిమడుగు గ్రామ శివారులోని మాబుసాహెకుంట, కలనూతల నిర్వాసిత కేంద్రం వద్ద కొండను పిండిచేసి మట్టి, గ్రావెల్ను దోచుకున్నారు. రాయవరం చెరువు, కోలభీమునిపాడు గ్రామ సమీపంలోని ముద్దసానమ్మ గండి వద్ద ఉన్న కొండ, పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు ప్రాంతంలోని కొండ, పెద్దారవీడు చెరువు, తర్లుపాడు మండలాల్లో ఉన్న చెరువుల్లోని మట్టిని అధికార పార్టీ నేతలు అక్రమంగా తరలించుకుపోయారు. స్థానిక ఇటుకల వ్యాపారులకు విక్రయించి జేబులు నింపుకున్నారు.
నిశిరాత్రి వేళ..
పశ్చిమ ప్రాంతంలోని చెరువులు, కొండలను రాత్రివేళ కొల్లగొడుతున్నారు. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఆ మట్టిని తరలిస్తున్నారు. ఇలా నిత్యం 60 నుంచి 80 వరకు ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. ఇలా రోజూ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. చెరువు మట్టి టిప్పరుకు రూ.3 వేలు, కొండమట్టికి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. అదే ట్రాక్టరు చెరువు మట్టి అయితే రూ.1500 వరకూ దండుకుంటున్నారు. ప్రభుత్వానికి పన్నులు, సీనరేజ్ రూపంలో ప్రతి నెల చెల్లించాల్సిన రూ.30 లక్షల ఆదాయాన్ని అక్రమార్కులే దిగమింగుతున్నారు.
గనుల అధికారులు మమ..
మార్కాపురం భూగర్భ గనుల శాఖ తూతూమంత్రంగా దాడులు జరిపించి మమ అన్పిస్తున్నారు. కార్యాలయ పరిధిలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 240 కేసులు నమోదు చేసినట్లు భూగర్భగనుల శాఖ ఏడీ విష్ణువర్థనరావు తెలిపారు. రూ.88.82 లక్షల మేర అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. నిత్యం వందలాది వాహనాల్లో తరలిపోతుంటే ఏడాది మొత్తంలో కేవలం రెండొందలకు పైగా కేసులే నమోదు చేయడం వారి నిఘా లోపానికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు ఆ రోజు నేను లేను.. తొడగొట్టినోళ్లు హడలెత్తుతున్నారు
[ 01-06-2024]
‘అమ్మతోడు.. నేను ఆ రోజు గొడవల్లో ఎక్కడా లేను! అయినా నన్ను స్టేషన్కు పిలుస్తున్నారు. బైండోవర్ చేస్తామంటున్నారు. నాకు ఆ గొడవలతోనే ఎలాంటి సంబంధం లేదు. నేను స్టేషన్కు రానన్నా..’ ఇదీ అధికార పార్టీకి చెందిన ఒక యువ నాయకుడి బేల మాటలు. -
కౌంట్డౌన్.. 4వ తేదీ ఖాళీల్లేవ్..!
[ 01-06-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పైనే అందరి చూపులు. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయ్.. ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారు.. ఏ నలుగురు కలిసినా సర్వత్రా ఇదే చర్చ. ఇదే సమయంలో లెక్కింపు రోజున జిల్లా కేంద్రం ఒంగోలులో ఉండి ఫలితాలు తెలుసుకోవడం పైనా పలువురు ఆసక్తి చూపుతున్నారు. -
బాబోయ్.. తీగలూ తెగుతున్నాయ్
[ 01-06-2024]
రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనేది నానుడి. రోళ్ల సంగతి తర్వాత.. భానుడి భగభగలకు కాలం చెల్లిన విద్యుత్తు తీగలిప్పుడు తెగి పడుతున్నాయి. గత మూడు రోజులుగా క్రమేణా పెరుగుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. -
నిన్న కందిపప్పు.. నేడు గోధుమ వంతు
[ 01-06-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను పెంచుతామని ప్రకటించిన జగన్.. ఇప్పుడు గతంలో ఇచ్చిన వాటిలోనే కోతలు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న సమయంలో జూన్ నెల రేషన్ కోటాలోనూ కోత పెట్టారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4న ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు ప్రకాశం భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రూ. 338.. అధరగొట్టిన పొగాకు
[ 01-06-2024]
అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు మంచి డిమాండ్ ఏర్పడడంతో అన్ని వేలం కేంద్రాల్లో ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇతర దేశాల్లో పంట దిగుబడి తగ్గింది. దీంతో ఆంధ్రా సీజన్లో ఉత్పత్తికి డిమాండ్ ఏర్పడింది. -
కొండలు కొల్లగొట్టేస్తున్నారు
[ 01-06-2024]
కంభం మండలంలోని చిన్నకంభం గ్రామ సమీపంలోని విద్యుత్తు ఉప కేంద్రం సమీపంలోని కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. జేసీబీ ఏర్పాటు చేసి మట్టి తవ్వి ట్రాక్టర్లతో కంభం, బేస్తవారపేట పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్నారు. -
పేదరాలి పొలంపై వైకాపా పెత్తనం
[ 01-06-2024]
వైకాపా నాయకులు చెప్పిందే తడవుగా పైసలు ఇస్తే చాలు సి.ఎస్.పురం మండల రెవెన్యూ అధికారులు ఒకరి భూమిని మరొకరి పేరుపై బదలాయించేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరుపై మార్చేస్తున్నారు. -
మద్యం మత్తులో బీరు సీసాతో దాడి
[ 01-06-2024]
మద్యం మత్తులో తన స్నేహితుడే 108 అంబులెన్సు డ్రైవర్పై బీరు సీసాతో దాడి చేసిన సంఘటన కురిచేడు మండలం బోధనంపాడులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ అబుదావలి, వేమా రమేష్లు స్నేహితులు. -
22 ఎయి‘డెడ్’ పాఠశాలలు
[ 01-06-2024]
ఎయిడెడ్ వ్యవస్థ క్రమంగా కనుమరుగుతోంది. ఒక్క విద్యార్థి కూడా లేని 22 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. -
చెవిరెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే ఆర్వోపై వేటు
[ 01-06-2024]
ఒంగోలు ఎంపీ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బాధ్యతల నుంచి తప్పించారని ఆ నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
-
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..