మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాయిదా వేయాలని విజ్ఞప్తులు
కేయూ పరీక్షల విభాగం కార్యాలయం
కేయూ క్యాంపస్, వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారంరోజులుగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొద్దిరోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 6 నుంచి డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల బాధ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
122 పరీక్ష కేంద్రాలు.. 1.70 లక్ష మందికి పైగా విద్యార్థులు
కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో 1,71,991 మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహచారి, అదనపు అధికారిణి డా.ఎం.తిరుమలాదేవి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 45, వరంగల్లో 47, ఖమ్మంలో 30 కేంద్రాలుండగా.. విద్యార్థుల హాల్టికెట్లను సైతం కేయూ వెబ్సైట్లో పెట్టారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల ఆరు నుంచి జూన్ మొదటి వారం వరకు పరీక్షలు ఉంటాయి.
గ్రామీణ విద్యార్థులకు ప్రమాదమే..
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొందరు 30-40 కి.మీ. నుంచి జిల్లా, మండల కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఎండల్లో రాకపోకలు కష్టమే. మరోవైపు పరీక్ష కేంద్రాల్లో సైతం ఉక్కపోతతో అవస్థలు తప్పేలా లేవు. ఒకవైపు లోక్సభ, పట్టభద్రుల (నల్గొండ-ఖమ్మం-వరంగల్) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కట్లు తప్పేలా లేవు.
విద్యార్థుల ఆందోళన..
పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు, కేయూలోని విద్యార్థి సంఘాలు రెండురోజులుగా ఆందోళన చేస్తూ.. అధికారులకు వినతిపత్రాలను అందిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మండలాలను ప్రభుత్వం రెడ్జోన్గా ప్రకటించింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల విద్యార్థులకు ఏదైనా జరిగితే వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మానియాలో వాయిదా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా జూన్ 7 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేయూతో పోల్చితే ఓయూలో డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన సమాధానపత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల, సర్టిఫికెట్లు అందించడానికి కార్యాచరణ రూపొందించారు. మరోవైపు కేయూ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు.
తప్పడం లేదు..: ఆచార్య పి.మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్
ఎండల తీవ్రత ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. జులై నుంచి బీఈడీ, ఐసెట్, పీజీసెట్, లాసెట్ తదితర పోటీ పరీక్షల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. త్వరితగతిన పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ షెడ్యూల్ ప్రకటించాం. వాయిదా వేస్తే పీజీ, ఐసెట్ తదితర కోర్సుల్లో సీట్లు పొందే విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలను వాయిదా వేయడం కుదరదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.