icon icon icon
icon icon icon

Telangana Elections: మోండా మార్కెట్‌ వీరులు

చిన్నతనంలో రాజకీయాల్లోకి ప్రవేశించి జనాకర్షక నేతలుగా ఎదిగిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరమైంది. మొదటిసారే ప్రత్యర్థులుగా తలపడిన ఆ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తిస్తున్నారు.

Updated : 15 Nov 2023 07:38 IST

ఈనాడు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: చిన్నతనంలో రాజకీయాల్లోకి ప్రవేశించి జనాకర్షక నేతలుగా ఎదిగిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరమైంది. మొదటిసారే ప్రత్యర్థులుగా తలపడిన ఆ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తిస్తున్నారు. మోండా మార్కెట్‌ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, మంత్రి పదవులను అధిరోహించారు. అలుపెరుగని పోరాటంతో మాస్‌ లీడర్లుగా ఎదిగారు.

ఒకేసారి రంగంలోకి..

  • ఏప్రిల్‌ 7, 1954న జన్మించిన పద్మారావుగౌడ్‌.. 1973లో యువజన కాంగ్రెస్‌లో చేరారు. 1977 నుంచి జంట నగరాల్లో క్రియాశీలంగా పనిచేశారు. 1986లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మోండా మార్కెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా తొలిసారి బరిలో నిలిచి విజయం సాధించారు.
  • అక్టోబరు 6, 1965న జన్మించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనంలోనే రాజకీయాల్లోకి దిగారు. పద్మారావుకు పోటీగా మొదటిసారి 1986లో మోండా మార్కెట్‌ కార్పొరేటర్‌గా జనతాదళ్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు.
  • 1986 ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఓడిపోయిన తలసాని.. తరువాత కాలంలో తెదేపాలో చేరారు. 1994లో సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి రవీంద్రనాథ్‌పై గెలుపొందారు. 1999 ఎన్నికల్లోనూ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో.. అప్పటి సీఎం చంద్రబాబు ఆయనను మంత్రిగా తీసుకున్నారు.
  • 1991 వరకు కార్పొరేటర్‌గా పనిచేసిన పద్మారావుగౌడ్‌ 2001లో తెరాసలో చేరారు. పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2002లో కారు గుర్తుపై కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
  • మొదటిసారి 1986లో కార్పొరేటర్‌ పదవికి పోటీపడిన వీరిద్దరు.. తిరిగి 2004లో ఎమ్మెల్యే స్థానానికి పోటీపడ్డారు. పద్మారావుగౌడ్‌ గెలవగా, తలసాని ఓడారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పటి తెరాస ఎమ్మెల్యేలంతా 2008లో రాజీనామా చేయగా సికింద్రాబాద్‌ ఉపఎన్నిక జరిగింది. తలసాని పద్మారావుపై ఎక్కువ మెజార్టీతో గెలిచారు.
  • 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస నుంచి పద్మారావుగౌడ్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పోటీచేసి.. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా తెదేపా తరఫున పోటీ చేసిన తలసాని కాంగ్రెస్‌ అభ్యర్థి జయసుధ చేతిలో ఓడిపోయారు.
  • తెలంగాణ ఏర్పాడ్డాక 2014 ఎన్నికల్లో వీరి నియోజకవర్గాలు మారాయి. తలసాని తెదేపా నుంచి సనత్‌నగర్‌ ఎమ్మెల్యేగా, పద్మారావుగౌడ్‌ తెరాస నుంచి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పద్మారావుగౌడ్‌ ఎక్సైజ్‌ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచి ఉపసభాపతి అయ్యారు. సనత్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని తెరాసలో చేరి మంత్రి అయ్యారు. 2018లో మరోసారి గెలిచి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img