Rajasthan Elections: రాజస్థాన్లో కొనసాగుతున్న ఓటింగ్.. 5 గంటల వరకు 68% ఓట్లు పోల్
Rajasthan Elections: రాజస్థాన్లో 199 స్థానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జైపుర్: రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ (Polling) శనివారం కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 199 స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి హఠాన్మరణంతో పోలింగ్ వాయిదా పడింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఓటు వేసిన పలువురు ప్రముఖులు..
కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ జైపుర్లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన టోంక్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఆయన కుమారుడు వైభవ్ గహ్లోత్ సర్దార్పురలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు సీఎం గహ్లోత్ సర్దార్పురలోని తన పూర్వీకుల ఇంటికి వెళ్లారు.
- రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా జైపుర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తూర్పు బికనేర్లో ఓటేశారు. క్యూలైన్లో నిల్చుని ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ జైపుర్లో ఓటేశారు.
- కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్పుర్లో, కైలాశ్ చౌధరీ బర్మేర్లో ఓటు వేశారు.
- భాజపా నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝలావర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- భాజపా ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా, ఆయన సతీమణి రంజనాతో కలిసి స్కూటీపై వచ్చి ఓటు వేశారు.
- భాజపా ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి జైపుర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.