30 ఏళ్ల నుంచి ‘టీ’నే ఆహారంగా...!

ఒక్క పూట భోజనం చేయకపోతేనే అల్లాడిపోతాం. అలాంటిది వారం కాదు.. నెల కాదు.. ఏకంగా 30 సంవత్సరాల నుంచి భోజనం చేయకుండా కేవలం టీ మాత్రమే తాగుతూ జీవిస్తోంది 67 ఏళ్ల ఓ మహిళ. ఇప్పటికీ ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు చెబుతుంటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది...

Published : 27 Sep 2020 09:42 IST

కోల్‌కతా: ఒక్క పూట భోజనం చేయకపోతేనే అల్లాడిపోతాం. అలాంటిది వారం కాదు.. నెల కాదు.. ఏకంగా 30 సంవత్సరాల నుంచి భోజనం చేయకుండా కేవలం టీ మాత్రమే తాగుతూ జీవిస్తోంది 67 ఏళ్ల ఓ మహిళ. ఇప్పటికీ ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు చెబుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఇంతకూ ఆమె కథేంటో తెలుసా?

నందరాణి మెహంతో.. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణదీనాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ. కుటుంబంలో కలహాలు రేగడంతో 30 ఏళ్ల క్రితమే ఆమె కొడుకు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నందరాణి అన్నం తినడం మానేశారు. కేవలం రోజుకు పదిపన్నెండు కప్పుల టీ మాత్రమే తాగుతూ కాలం వెల్లబుచ్చుతున్నారు. స్థానికంగా మురీ అని పిలిచే ఓ పదార్థాన్ని మాత్రం ఎప్పుడో ఒకసారి తీసుకుంటారట. ఆమెకు పాన్‌ అలవాటు కూడా ఉంది.

సాధారణంగా పాన్‌లో సున్నం వేస్తారు. ఇది ఆరోగ్యానికి హాని కరం. అందులోని కాల్షియం కార్బోనేట్‌ పేగులను కొరికేస్తుందంటారు. అందులోనూ ఆమె ఆహారం తీసుకోవడం లేదు. అయినా ఆమె ఆరోగ్యంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె తాగే టీలో ఎక్కువ శాతం పాలు ఉండేటట్లు చూసుకుంటారట. పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఆమెకు కావాల్సిన పోషకాలను ఇస్తున్నాయని, అందుకే ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె బలార్‌గట్‌లో ఓ చిన్న గుడిసెలో ఉంటూ స్థానిక మార్కెట్‌లో చిన్న టిఫిన్‌ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. తన కొడుకు ఎప్పుడు తిరిగొస్తాడా? అని ఎదురుచూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని