ఆ‘రుషి’.. చిన్నారుల చదువుకు కృషి

ఆ గ్రామాల్లో చిన్నారుల చదువులు అంతంత మాత్రమే. బాగా చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు మరీ అరుదు. మరి అలాంటి చిన్నారులకు ప్రోగ్రామింగ్‌లో ఆరితేరేలా చేస్తే.. ఆంగ్లం నేర్పించి కోడింగ్‌లో శిక్షణనిస్తే.. సాంకేతిక విద్యలో అవగాహన కల్పిస్తే.. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చింది 16 ఏళ్ల ఆరుషి అగర్వాల్‌.

Published : 24 Nov 2020 21:38 IST

 చిత్రాలు: ట్విటర్‌ ద్వారా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ గ్రామాల్లో చిన్నారుల చదువులు అంతంత మాత్రమే. బాగా చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు మరీ అరుదు. మరి అలాంటి చిన్నారులకు ప్రోగ్రామింగ్‌లో ఆరితేరేలా చేస్తే.. ఆంగ్లం నేర్పించి కోడింగ్‌లో శిక్షణనిస్తే.. సాంకేతిక విద్యలో అవగాహన కల్పిస్తే.. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చింది 16 ఏళ్ల ఆరుషి అగర్వాల్‌. అమెరికాలో స్థిరపడిన తను వారాంతాల్లో వర్చువల్‌ పాఠాలు చెబుతుంది. అసలు ఎవరీ ఆరుషి? చిన్నారులకు ప్రోగ్రామింగ్‌ నేర్పడమేంటి? అసలు తనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది. తెలుసుకుందాం.

హరియాణాలో పుట్టిన ఆరుషి బెంగళూరులో స్థిరపడింది. పదేళ్ల వయసులో అమెరికా పయనమైంది. ప్రస్తుతం అక్కడే పదకొండో తరగతి చదువుతోంది. కంప్యూటర్‌ సైన్స్‌ అంటే తనకెంతో ఇష్టం. ఏడో తరగతి చదివే వయసులో ఎటువంటి అనుభవం లేకుండా భయపడుతూనే ఓ రోబోటిక్స్‌ బృందంలో చేరింది. తదుపరి ఆ బృంద సభ్యుల ప్రోత్సాహంతో స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం)లో మక్కువ పెంచుకుంది. రోజులో 5గంటలు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, గేమింగ్‌ తదితర వాటిలో మెళకువలు నేర్చుకుంది. ఈ రంగంలో గల విస్తృత అవకాశాల గురించి తెలుసుకుంది. భారత్‌లో విద్యను, ఉద్యోగావకాశాలను సులభతరం చేసేందుకు ఈ రంగం ఉపయోగపడుతుందని భావించింది. అప్పుడే ఏనాటికైనా తను నేర్చుకున్న విద్యను భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల చిన్నారులకు చేరవేయాలనుకుంది. 

అలా ‘అన్‌నోన్‌-16’
తర్వాత ఏడాది తన రోబోటిక్స్‌ బృందం మిషిగన్‌లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో బాలికల శాతం చాలా తక్కువ. స్టెమ్‌లో మహిళల శాతం తక్కువగా ఉండటానికి భయం, సౌకర్యాలలేమి వారిని వెనకడుగు వేసేలా చేస్తోందని గ్రహించింది. ఎలాగైనా వారిలో భయం పోగొట్టి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఆత్మవిశ్వాసం నింపాలనుకుంది. నిపుణులు, ఆ రంగంలోని ప్రముఖ మహిళలతో చర్చించింది. దీంతో చిన్నతనంలో ‘అన్‌నోన్‌-16’ అనే పేరుతో ఓ శిబిరాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వివిధ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ప్రోగ్రామింగ్‌ పాఠ్యాంశాలను నేర్పేందుకు కృషి చేస్తోంది. వివిధ ఎన్‌జీఓలతో కలిసి విద్యార్థులకు వనరులు, అవకాశాలు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. 

భారత్‌లో అలా..
లహంతి క్లబ్‌ అనే ఎన్‌జీఓ ద్వారా బిహార్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాల చిన్నారులకు ప్రోగ్రామింగ్‌, కంప్యూటర్‌ విద్యలో ఆసక్తి ఉందని తెలుసుకుంది ఆరుషి. కానీ కనీస చదువులకు కూడా సదుపాయాలు లేని ఆ ప్రాంతాల్లో ప్రోగ్రామింగ్‌ నేర్పడం అంటే అంత సులువైన పనికాదు. అంతేకాదు కోడింగ్‌ రాసేందుకు ముందుగా రావాల్సింది ఇంగ్లిష్‌. మారుమూల ప్రాంతాల్లోని ఆ చిన్నారులకు అసలు ఆంగ్ల భాషే తెలియదు. వారికి ఆ భాష నేర్పేందుకు తన వారాంతాలను అంకితం చేసింది. అయినా తన ముందున్న మరో సవాలు. వసతుల లేమి. ఇంటర్నెట్‌ సదుపాయం, కంప్యూటర్లు, నేర్పేందుకు స్థలం. దీంతో లహంతి క్లబ్‌ సహాయం తీసుకుని ఆ గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించి విద్య నేర్పడం ప్రారంభించింది. అమెరికా నుంచి ప్రతి శని, ఆదివారాలు ఉదయం 5గంటలకి సుమారు 300మందికి స్కైప్‌ ద్వారా వారికి అర్థమయ్యే ఉదాహారణలతో ఇంగ్లిషు పాఠాలు చెబుతుంది. తన ‘అన్‌నోన్‌-16’ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులకి పైథాన్‌, జావా, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌ తదితర వాటిలో శిక్షణా సౌకర్యం కల్పించింది. 

భవిష్యత్తు ఆలోచనలు   
భవిష్యత్తులో కంప్యూటర్‌ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, టెక్నాలజీతో పర్యావరణ సమస్యలకు చెక్‌ పెట్టాలనుకుంటుంది ఆరుషి. తను నేర్చుకున్న విద్యను నలుగురికీ పంచుతానని చెబుతోంది. అంతేకాదు నాణ్యమైన విద్యని మారుమూల ప్రాంత చిన్నారులకు చేరవేసేందుకు తనవంతు కృషి చేస్తానని అంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని