Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Aug 2023 13:09 IST

1. మణిపుర్ కల్లోలం.. ఇంటి నుంచి వెళ్లిన 30 మంది ఇప్పటికీ రాలేదు..!

కల్లోలిత మణిపుర్‌(Manipur)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నప్పటి నుంచి.. దాదాపు 30 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. మూడు నెలల కాలంలో వీరంతా అదృశ్యమయ్యారు. వారిలో టీనేజర్ల నుంచి నడి వయసు వరకు ఉన్నారని మీడియా కథనాలు వెల్లడించాయి.(Manipur violence) 47 ఏళ్ల సమరేంద్ర సింగ్‌ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త. ఉద్రిక్తతలు మొదలైన కొద్దిరోజులకే అదృశ్యమయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లేహ్‌ అందాలు వీక్షించాలనుకుంటున్నారా.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

ప్రకృతి అందాలను వీక్షించటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు.. మధ్యలో అక్కడక్కడా ఉండే గ్రామాలు.. అందమైన సరస్సులు కొలువుదీరిన ప్రాంతాలను సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి ప్రాంతమే లేహ్‌. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఉన్న ఈ అద్భుతమైన ప్రాంతాలను వీక్షించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేసుల సుడిగుండంలో ట్రంప్‌.. మరోసారి నేరాభియోగాలు..!

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు (Trump Indicted) నమోదవ్వగా.. తాజాగా మరో కేసులోనూ ఎదురుదెబ్బ తగిలింది. 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు చేసిన ప్రయత్నానికి గానూ ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోదీని కొనియాడిన అజిత్‌ పవార్‌.. ఎవరితో పోల్చారంటే..?

దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ గొప్ప పేరున్న నాయకుడని.. ఆయనలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే కీర్తిని సంపాదించారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కొనియాడారు. ప్రధాని మోదీ ‘లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం’ అందుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అజిత్‌ పవార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వంలో చేరడంపై ఆయన వివరణ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆత్మహత్య..

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ (Nitin Desai) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అతడు తన స్టూడియోలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి నితిన్‌ దేశాయ్‌ తన స్టూడియోకు వెళ్లాడు. అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హబ్సిగూడలోని వస్త్రదుకాణం, రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం..

నగరంలోని హబ్సిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కాంప్లెక్స్‌లోని 2, 3వ అంతస్తుల్లో ఉన్న ఓ వస్త్ర దుకాణం, రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని పెట్రోల్‌ బంకును పోలీసులు మూసివేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్కూల్‌కు వెళ్తున్న చిన్నారిని చిదిమేసిన బస్సు

నగరంలోని బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దీక్షిత అనే 8 ఏళ్ల బాలిక మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ వద్ద కిశోర్ అనే వ్యక్తి తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తుండగా రోడ్డుపై గుంతలు కారణంగా వాహనం స్కిడ్‌ అయ్యింది. ఈ క్రమంలో బాలికతో పాటు ఆమె తండ్రి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు దీక్షిత పైనుంచి వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అత్యాచార వీడియోల వ్యాప్తి కట్టడి చర్యలు భేష్‌.. కేసు మూసేసిన సుప్రీంకోర్టు

సామాజిక మాధ్యమాల్లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు, అత్యాచార వీడియోల వ్యాప్తిని నియంత్రించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మూసివేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. వీడియోల వ్యాప్తి కట్టడి చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్‌, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె..శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్‌, ఎన్.ఎన్.నగర్‌ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్‌, నిత్యావసరాలను బాధితులకు ఆమె పంపిణీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గత తొమ్మిదేళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: సంజూ శాంసన్

మెగా టోర్నీల్లో ఆడాలంటే జట్టులో స్థానం దక్కాలి. అలా జరగాలంటే వచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రమంలో చివరి అవకాశంగా వచ్చిన మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజూ శాంసన్ (Sanju Samson) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విండీస్‌తో జరిగిన (WI vs IND) మూడో వన్డేలో 51 పరుగులు చేసి రాణించాడు. రెండో మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్‌కు చేరి విమర్శలపాలైన సంజూ.. ఈసారి మాత్రం ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తన సత్తా ఏంటో చూపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని