Hyderabad: స్కూల్‌కు వెళ్తున్న చిన్నారిని చిదిమేసిన బస్సు

బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి దీక్షిత అనే ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది.

Updated : 02 Aug 2023 14:10 IST

హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దీక్షిత అనే 8 ఏళ్ల బాలిక మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ వద్ద కిశోర్ అనే వ్యక్తి తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తుండగా రోడ్డుపై గుంతలు కారణంగా వాహనం స్కిడ్‌ అయ్యింది. ఈ క్రమంలో బాలికతో పాటు ఆమె తండ్రి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు దీక్షిత పైనుంచి వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కిశోర్‌కు గాయాలయ్యాయి. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. దీక్షిత బౌరంపేట్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. బాలిక మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బస్సు డ్రైవర్ అతివేగమే దీక్షిత మృతికి కారణమని బాచుపల్లి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలతో అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని