DAC: సైన్యానికి బిగ్‌ బూస్ట్‌..! 97 ‘తేజస్‌’ యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా

భారత సైన్యానికి 97 తేజస్ యుద్ధవిమానాలు, 156 ప్రచండ్‌ హెలికాప్టర్లను సమకూర్చే ఒప్పందానికి కేంద్రం పచ్చజెండా ఊపింది.

Published : 30 Nov 2023 17:55 IST

దిల్లీ: సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 97 ‘తేజస్‌’ తేలికపాటి యుద్ధవిమానాలు (Tejas LCA), 156 ప్రచండ్‌ (Prachand) హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. దీంతోపాటు వాయుసేనకు చెందిన 84 ‘సుఖోయ్‌-30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (DAC) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా ఒప్పందాల విలువ దాదాపు రూ.1.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. తేజస్ ‘మార్క్ 1-ఏ’ యుద్ధ విమానాలను వాయుసేన కోసం, హెలికాప్టర్లను వాయుసేనతోపాటు ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్‌ రైలు

‘తేజస్‌’ తేలికపాటి యుద్ధవిమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దీన్ని రూపొందించింది. యాక్టివ్‌ ఎలక్ట్రానిక్- స్కాన్డ్ అర్రే రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ తదితర సామర్థ్యాలు దీని సొంతం. ‘ప్రచండ్‌’నూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. ఈ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్‌ను గత సంవత్సరం వాయుసేన, సైన్యంలోకి చేర్చారు. 21 వేల అడుగుల ఎత్తులోనూ సేవలు అందించగలదు. సియాచిన్‌, లద్ధాఖ్‌, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక పర్యటన సందర్భంగా తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌’లో విహరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని