NIA: ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్‌ఐఏ.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు..!

ఖలిస్థానీ ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో భాగంగా ఆరు రాష్ట్రాల్లోని 50కిపైగా లొకేషన్లలో దాడులు చేపట్టింది. ముఖ్యంగా ఖలిస్థానీ గ్యాంగస్టర్ల స్థానిక హవాల నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పడింది.

Updated : 27 Sep 2023 22:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌(India)-కెనడా (Canada) మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు-గ్యాంగ్‌స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని కత్తిరించే పనిలోపడింది. దీనిలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకుంది. పంజాబ్‌, హరియాణా, దిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో 50 చోట్ల ఈ దాడులు జరిగాయి. 

లారెన్స్‌ బిష్ణోయి, అర్షదీప్‌ దల్లా తదితరులతో సంబంధం ఉన్న నేరస్థుల నుంచి భారీగా ఆయుధాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. మందుగుండు, డిజిటల్‌ ఆధారాలను సైతం సేకరించినట్లు తెలిసింది. ఎన్‌ఐఏ ప్రకారం.. దల్లా, గౌరవ్‌ పాటిల్‌ వంటి వ్యక్తులు ఇక్కడ లేకపోయినా ఖలిస్థానీ ఉగ్రవాదులతో వారు టచ్‌లో ఉన్నారు. నిధుల సేకరణ, అక్రమ ఆయుధాల రవాణా, హత్యలు, డోపీడీలు వారితో చేయిస్తున్నారు. 

భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలు-గ్యాంగ్‌స్టర్ల నుంచి హవాల మార్గంలో డబ్బులు వస్తున్నాయని.. వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపీఏ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. బుధవారం పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హరియాణాలో నాలుగు చోట్ల, ఉత్తరాఖండ్‌లో రెండు, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు జరిగాయి.

పెండింగ్‌లో 70 కొలీజియం సిఫార్సులు

ఇప్పటికే భారత్‌ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌ ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. దీంతోపాటు హర్విందర్‌ సింగ్‌ సంధు, లక్బిర్‌ సింగ్‌ సంధు పేరిట రూ.10 లక్షలు చొప్పున రివార్డును కూడా ప్రకటించింది. వీరికి బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని