‘సామ్‌ బహదూర్‌’గా విక్కీ కౌశల్‌

భారతదేశపు యుద్ధవీరుల్లో ఒకరు ఫీల్డ్ మార్షల్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానేక్‌షా. ఆయన జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతోంది. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి మేఘన గుల్జార్‌ దర్శకత్వం వహిస్తుండగా ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.

Published : 03 Apr 2021 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారతదేశపు యుద్ధవీరుల్లో ఫీల్డ్ మార్షల్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానేక్‌షా ఒకరు. ఆయన జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతోంది. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తుండగా ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. శనివారం మానేక్‌షా జయంతి. ఈ సందర్భంగా సినిమాకి ‘సామ్‌ బహదూర్‌’ అనే పేరును ఖరారు చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

సినిమా గురించి విక్కీ కౌశల్ స్పందిస్తూ..‘‘నేను సామ్‌ బహదూర్‌ గురించి ఎన్నో కథలు విన్నాను. పంజాబ్‌ నుంచి వచ్చిన మా తల్లితండ్రులు 1971నాటి యుద్ధం గురించి చెప్పారు. నేను ఆయన గురించి చదువుతున్నప్పుడు అదో రకమైన భావన ఏర్పడింది. ఆయనొక హీరో, దేశభక్తుడు. అలాంటి గొప్పవీరుడి పాత్రలో నటించడం గర్వంగా ఉంది’’ అని తెలిపారు.

దర్శకురాలు మేఘన..  మానెక్‌షా గురించి మాట్లాడుతూ ‘‘ఆయన సైనికులకే సైనికుడు. పెద్దల్లో పెద్దమనిషి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి రోనీ, విక్కీకౌశల్‌తో కలిసి కథ చెప్పడం చాలా గౌరవంగా ఉంది’’ అని అన్నారు. 

‘‘మన గొప్ప హీరో అయిన సామ్ బహదూర్‌ కథను సినిమాగా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సినిమా టైటిల్‌ని ప్రకటించాం. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటూ గౌరవించుకోవాలని ఆశిస్తున్నా’’అంటూ నిర్మాత స్పందించారు.

సామ్ మానేక్‌షా నాలుగు దశాబ్దాలుగా సైన్యంలో పనిచేశారు. ఐదు యుద్ధాల్లో పాల్గొన్నారు. ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మొట్టమొదటి భారత ఆర్మీ అధికారి. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొని విజయం సాధించారు. విక్కీ కౌశల్‌ గతంలో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’లాంటి దేశభక్తిని రంగిలించే చిత్రాల్లో నటించి అలరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని