Kajol: దుమారం రేపుతోన్న కాజోల్‌ వ్యాఖ్యలు.. ఎట్టకేలకు క్లారిటీ

రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ కాజోల్‌ (kajol) చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు.

Published : 09 Jul 2023 13:24 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి కాజోల్‌ (Kajol) గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. వాటిపై తాజాగా కాజోల్‌ స్పందించారు. తన మాటలను పలువురు తప్పుగా అర్థం చేసుకుని ఇలాంటి చర్చలు లేవనెత్తుతున్నారని అన్నారు. ‘‘చదువు ప్రాముఖ్యత గురించి తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ నాయకులను తక్కువ చేసి చూడాలనేది నా ఆలోచన కాదు. దేశాన్ని సరైన అభివృద్ధి దిశగా నడుపుతున్న కొంతమంది గొప్ప నాయకులు కూడా మనకు ఉన్నారు’’ అంటూ ఆమె స్పష్టత నిచ్చారు.

కాజోల్‌ నటించిన రీసెంట్‌ ప్రాజెక్ట్‌  ‘ది ట్రైల్‌’. దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మహిళా సాధికారిత గురించి మాట్లాడారు. ‘‘మార్పు అనేది ఎంతో అవసరం. కానీ ఇండియా లాంటి దేశంలో మార్పు చాలా నిదానంగా జరుగుతోంది. ఎందుకంటే, సంప్రదాయాలు, ఆలోచనా విధానంతో మనం నిమగ్నమైపోయాం. ఇది విద్యపై ప్రభావం చూపుతోంది. అలాగే, విద్యావ్యవస్థపై సరైన అవగాహన లేని రాజకీయ నాయకులు మనకు ఉన్నారు. ఇలా చెబుతున్నందుకు క్షమించాలి. మనల్ని పాలించే చాలామంది నేతలకు విద్యా విధానంపై ఆలోచన లేదు’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర చర్చకు దారి తీశాయి. పలువురు రాజకీయ నాయకులు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని