Bollywood: ఒక్కటి కాదు.. మూడు!

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ఒకే సమయంలో ఒకే సినిమాపైనే దృష్టి పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. అదీ తను చేస్తున్న పాత్రపై ఫోకస్‌ పెట్టడానికే. ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడటంతో తర్వాత ఏ ప్రాజెక్ట్‌

Updated : 13 Jun 2022 07:27 IST

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ఒకే సమయంలో ఒకే సినిమాపైనే దృష్టి పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. అదీ తను చేస్తున్న పాత్రపై ఫోకస్‌ పెట్టడానికే. ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడటంతో తర్వాత ఏ ప్రాజెక్ట్‌ చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో క్రేజీ ప్రాజెక్టుకి సిద్ధమవుతారని అభిమానులు ఆలోచిస్తున్నారు. కానీ ఆమిర్‌ ఈసారి అందరి అంచనాలకు భిన్నంగా ఒకేసారి ఏకంగా మూడు చిత్రాలకు పచ్చజెండా ఊపబోతున్నారు. ‘హిచ్‌కీ’ దర్శకుడు సిద్ధార్థ్‌ పి.మల్హోత్రా ప్రస్తుతం ఆమిర్‌ వారసుడు జునైద్‌తో.. యశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఒక చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ ఆమిర్‌తోనూ పలు దఫాలుగా కొన్ని కథలపై చర్చించారు. అందులో ఒకటి బాగా నచ్చిందట. దానికి ఓకే చెప్పడంతో వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతున్నట్టు సమాచారం. ఇదికాక మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ‘ఛాంపియన్స్‌’ అనే స్పానిష్‌ సూపర్‌హిట్‌ చిత్రం హక్కులు సొంతం చేసుకున్నారు. లాల్‌సింగ్‌ చద్ధా విడుదలైన వెంటనే సెప్టెంబర్‌ లేదా అక్టోబరులో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావ్‌ధాన్‌’ దర్శకుడు ఆర్‌.ఎస్‌.ప్రసన్న దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. దీంతోపాటు దేశంలోనే బాగా వివాదాస్పదుడైన ఒక ప్రసిద్ధ లాయర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించే బయోపిక్‌ ప్రాజెక్టు సైతం వరుసలో ఉంచుకున్నారని సమాచారం. దీనికి సంబంధించిన కథ, స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైంది అంటున్నారు.


టైమ్స్‌స్క్వేర్‌లో.. ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’

థానాయకుడు ఆర్‌.మాధవన్‌ తొలిసారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర ట్రైలర్‌ని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌స్క్వేర్‌లోని ‘నాస్‌డాక్‌’ భారీ బిల్‌బోర్డుపై విడుదల చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పని చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. మాధవన్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


జుగ్‌జుగ్‌ జీయో ‘దుప్పటా..’ స్టెప్పులు

రుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జుగ్‌జుగ్‌ జీయో’. జూన్‌ 24న విడుదలవుతోంది. సినిమా ప్రచారంలో భాగంగా ‘దుప్పటా...’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో హీరోహీరోయిన్లు ఫాస్ట్‌బీట్‌ సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ ఫ్లోర్‌పై స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటని రాసి, బాణీలందించారు డైస్‌బీ. ఆయనతో కలిసి శ్రేయా శర్మ ఆలపించారు. దుప్పటా.. పార్టీ యాంథెమ్‌గా సాగే సాంగ్‌ అని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రేమ, రొమాన్స్‌, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ‘జుగ్‌జుగ్‌ జియో’కి రాజ్‌ మెహతా దర్శకుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని