USA: అమెరికాలో.. 1శాతం ఉన్న భారతీయులు.. పన్నుల్లో వాటా 6శాతం

అమెరికా(USA)లో స్థిరపడిన భారత సంతతి పౌరుల వాటా ఒక శాతం అయినప్పటికీ పన్ను చెల్లింపుల్లో మాత్రం వారి వాటా ఆరుశాతమని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. జార్జియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన.. అమెరికాలో భారత సంతతి పౌరుల సేవలను కొనియాడారు.

Updated : 13 Jan 2023 11:43 IST

వాషింగ్టన్‌: అమెరికా(USA) జనాభాలో ఒక శాతం ఉన్న భారత సంతతి పౌరులు(NRIs).. అక్కడి పన్నుల్లో మాత్రం 6శాతం వాటా కలిగి ఉన్నారని అమెరికా చట్టసభ సభ్యుడొకరు వెల్లడించారు. ఈ వర్గం వారు ఎటువంటి సమస్యలు సృష్టించరని, చట్టాలను గౌరవిస్తారని అన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రసంగం చేసిన ఓ రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి.. తన నియోజకవర్గంలో అత్యధికంగా నివసించే భారత సంతతి పౌరులను ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడారు.

‘అమెరికా సమాజంలో సుమారు ఒక్క శాతం ఉన్నప్పటికీ పన్నుల్లో వారి వాటా ఆరు శాతం. వారు ఎటువంటి సమస్యలు సృష్టించరు. చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. తీవ్ర కుంగుబాటు, ఓవర్‌డోస్‌లతో అత్యవసర వైద్యం కోసం వచ్చే ఇతర పౌరులకు ఉండే సమస్యలు భారత సంతతి పౌరులకు లేవు. అత్యంత ఉత్పాదకత లేదా కుటుంబ ఆధారమైన వారి నేపథ్యం ఎంతో ఉత్తమమైనది’ అని అమెరికా ప్రతినిధుల సభలో చేసిన స్వల్ప ప్రసంగంలో చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్‌ నేత రిచ్‌ మెక్‌కార్మిక్‌ పేర్కొన్నారు.

‘నా నియోజకవర్గంలో భారత్‌ నుంచి వలస వచ్చిన వారి వాటానే అధికం. సుమారు లక్ష మంది ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు భారతీయులే. ఇలా ఇక్కడకు వలస వచ్చి స్థిరపడాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తాం. భారత రాయబారితోనూ సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నా’ అని రిచ్‌ మెక్‌కార్మిక్‌ చెప్పారు.

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన రిచ్‌ మెక్‌కార్మిక్‌ స్వయంగా వైద్యుడు. జార్జియా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ స్థిరపడిన ప్రవాసుల్లో భారత సంతతి పౌరుల జనాభా ఎక్కువే. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బాబ్‌ క్రిస్టియన్‌ను రిచ్‌ మెక్‌కార్మిక్‌ ఓడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని