అమెరికాలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 19 Apr 2023 22:37 IST

వాషింగ్టన్ డీసీ: ప్రవాసాంధ్రులకు దారి చూపింది చంద్రబాబేనని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావుతో పాటు తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకు కట్‌చేసి వేడుకలు జరుపుకొన్నారు.

ఈ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడం వల్లే లక్షలాది మంది ప్రవాసాంధ్రులు అమెరికాలో స్థిరపడ్డారన్నారు. ఆయన నేటి తరానికి మార్గదర్శి అని కొనియాడారు. సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం, ఎలాంటి కష్టాన్నయినా ఇష్టంగా మలుచుకోవడమే ఆయన నైజమన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను ఒంటపట్టించుకొని ఆయన చిన్నతనంలోనే మంత్రి, సీఎం పదవులను అధిరోహించి చరిత్ర సృష్టించారన్నారు. అనంతరం సతీష్ వేమన మాట్లాడుతూ.. వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలిచిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.  సంస్కరణ ఫలాలు పేదవారికి అందించారని కొనియాడారు. ఐటీ, బీటీ రంగాలను  ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే అందుకు చంద్రబాబు చూపిన చొరవే కారణమన్నారు. ఇటీవల శాసనమండలి ఎన్నికల ఫలితాలు ఏపీలో వైకాపా ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం, ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులే తెలియజేస్తున్నాయన్నారు.

చంద్రబాబు తన విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని భాను మాగులూరి అన్నారు.  దేశంలోనే ఇంత అనుభవం ఉండి క్రియాశీలంగా ఉన్న నాయకులు మరొకరు లేరన్నారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే చంద్రబాబు తిరిగి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్‌ఐ వర్జీనియా అధ్యక్షులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, కిషోర్ కంచర్ల, కార్తీక కోమటి, రాము జక్కంపూడి, రవి అడుసుమిల్లి, మురళీ గోవింద రెడ్డి దొంతిరెడ్డి, మల్లి వేమన, సిద్ధు బోయపాటి, పవన్ పొట్లూరి, హరికృష్ణ తోకల, వినిల్ శ్రీరామినేని, సుమంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని