తానా బోర్డు ఛైర్మన్‌గా డా.నాగేంద్ర శ్రీనివాస్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్‌ పదవికి డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 07 Mar 2024 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్‌ పదవికి డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో బోర్డు ఛైర్మన్‌తో పాటు కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్‌ నిమ్మలపూడి (జానీ) కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ప్రపంచ ప్రతిష్ఠాత్మక టెక్సాస్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి పీడియాట్రిక్‌ కార్డియో వాస్క్యూలర్‌ అనస్థీషియా విభాగంలో డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ సేవలందిస్తున్నారు. దీంతోపాటు బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో వైద్య విద్యను బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శిగా పనిచేశారు. తానా-బసవతారకం ప్రాజెక్టుకి ముందుండి సేవలందించారు. బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి తానా ఫౌండేషన్‌ తరఫున రూ.కోటి నిధిని సమకూర్చి వైద్య పరికరాలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా వేద పాఠశాలలు, గోశాలలు, గురుకులాలు, దేవాలయాల అభివృద్ధికి ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు సేవలందిస్తున్నారు.

బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మి దేవినేని గతంలో తానా బోర్డు కోశాధికారిగా, న్యూజెర్సీ రీజినల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 23వ తానా మహాసభలకు పలు కమిటీల్లో సేవలందించారు. కోశాధికారి జనార్దన్‌ నిమ్మలపూడి గతంలో తానా 21వ మహాసభ కార్యదర్శిగా, క్యాపిటల్ రీజియన్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. క్యాన్సర్‌ అవగాహన, నిధుల సమీకరణకు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌కి రూ.కోటి నిధి సమకూర్చడంలో కీలకపాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని