అమెరికా వీసా దక్కేదెలా!

అమెరికాలో ఉన్నత చదువులకు గాను వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ దొరకడం పలువురికి అందని ద్రాక్షగా మారింది.

Updated : 21 Dec 2022 07:15 IST

స్లాట్లు లభించక.. అయోమయంలో విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత చదువులకు గాను వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ దొరకడం పలువురికి అందని ద్రాక్షగా మారింది. పరిమితంగా వీసా స్లాట్లు జారీ చేయడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు ఇంకా ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తరగతుల ప్రారంభ సమయం సమీపిస్తుండటంతో అమెరికా వెళ్లగలమా? లేదా? అన్న అయోమయంలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు. అమెరికాలో ప్రస్తుత ఫాల్‌ సీజన్‌లో విద్యా సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఇంతవరకు మూడు దఫాలుగా వీసా స్లాట్లను విడుదల చేసినప్పటికీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో చాలా తక్కువగా విడుదలయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు వ్యయప్రయాసలకోర్చి చెన్నై, ముంబయి తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

విఫలమైన వారికి అవకాశమేదీ?

ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒక దఫా వీసా ఇంటర్వ్యూకు హాజరై విఫలమైన వారికి మరో అవకాశం కల్పిస్తామని అమెరికా రాయబార కార్యాలయం సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రకటించింది. సాధారణంగా వీసా ఇంటర్వ్యూకు ఎన్ని దఫాలైనా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే గత విద్యాసంవత్సరం నుంచి ఒక సీజన్‌లో ఒక దఫా మాత్రమే ఇంటర్వ్యూ స్లాట్‌ పొందేలా సాఫ్ట్‌వేర్‌లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో ప్రత్యేకంగా స్లాట్స్‌ విడుదల చేస్తే తప్ప రెండోదఫా ఇంటర్వ్యూకు అవకాశం పొందలేని పరిస్థితి. గత సీజన్‌లోనూ చాలామేర ఇంటర్వ్యూలు జరిగిన తర్వాతే.. ఒక దఫా విఫలమైన వారికి అవకాశం కల్పించారు. ప్రస్తుత సీజన్‌లో ఇంతవరకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఒకసారి కూడా స్లాట్‌ దక్కని విద్యార్థులూ చాలామంది ఉన్నారు. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ పొందడంలో జాప్యం అవుతున్నందున ఆలస్యంగా తరగతులకు హాజరయ్యే అంశాన్ని పరిశీలించాలంటూ అమెరికా రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా విద్యార్థులకు సూచనలు చేసింది. ఈమేరకు ‘ఐ-20’ జారీచేసిన విద్యాసంస్థతో సంప్రదింపులు జరపాలని తెలిపింది. స్లాట్‌ లభించిన తరవాత పరిస్థితులను వివరిస్తూ ఇంటర్వ్యూ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఆయా కాన్సులేట్‌ కార్యాలయ అధికారులను సంప్రదించవచ్చని కూడా పేర్కొంది. ఒకవేళ స్లాట్‌ లభించని పక్షంలో ఆయా విద్యాసంస్థలను సంప్రదించి వచ్చే ఏడాది ప్రవేశం పొందేలా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది.

10 శాతం వీసాలు పెంచుతాం..

భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. వచ్చే విద్యాసంవత్సరంలో వీసాలను 10 శాతం పెంచి.. మరింత మందికి అవకాశం కల్పిస్తామని రాయబార కార్యాయలం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని