NRI: వాషింగ్టన్‌ డీసీలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతి

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని జీడబ్ల్యూటీసీఎస్‌ పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్‌ సాయిసుధ పాలడుగు అన్నారు. 

Published : 19 Jan 2023 22:20 IST

వాషింగ్టన్‌ డీసీ: మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని జీడబ్ల్యూటీసీఎస్‌ పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్‌ సాయిసుధ పాలడుగు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను రూపుమాపి పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానంగా ఉండాలని ఎన్టీఆర్‌ ఆకాక్షించారని తెలిపారు. ‘నా తెలుగింటి ఆడపడుచులంటూ ఎంతో వాత్సల్యం చూపేవారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజ్యాధికారం కట్టబెట్టారు. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగుజాతికి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌ ఇస్తే.. ఆత్మవిశ్వాసం చంద్రబాబు ఇచ్చారు. ఎన్టీఆర్‌ భావావేశాన్ని, భావజాలాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. యూఎస్‌లో మహిళలు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కోసం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారానే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి’’ అని సాయిసుధ పాలడుగు అన్నారు.

రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌  షకీరా బేగం మాట్లాడుతూ... ‘‘మహిళలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎన్టీఆర్‌.. పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీ జగత్తును శాసించారు’’ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనిత మన్నవ, శ్రీలత నార్ల, పద్మజ బేవర, తనూజ యలమంచలి, శిరీష నర్రా, అపర్ణ వీరమాచినేని, కరిష్మ కొంగర, శాంతి పరిముపల్లి, ప్రణీత కంతు, శ్వేత కావూరి, వల్లి కుర్రే, పద్మ కోడె, మల్లి నన్నపనేని, రాధి కొట్నూరు, సుష్మ అమృతలూరి, దుర్గ చలసాని, కార్జల్ చలసాని, స్వప్న, స్వర్ణ కమల్, రోహిత తన్నీరు, రమాదేవి మన్నవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని